తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆగస్టు మొదటివారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల చేయగా.. మరికొద్ది రోజుల్లోనే ఫైనల్ కీ విడుదలచేసి, ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను వెల్లడించనున్నారు.


ఈ ఏడాది జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్షను నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ప్రాథ‌మిక కీని జూన్ 28న విడుద‌ల చేశారు. ప్రాథ‌మిక కీ పై వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను నిపుణుల క‌మిటీకి టీఎస్‌పీఎస్సీ పంపింది. ఈ క్రమంలో జులై 23 లేదా 24 తేదీల్లో ఫైన‌ల్ కీని విడుద‌ల చేసే అవకాశం ఉంది. తుది కీని విడుద‌ల చేసిన అనంత‌రం ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్రక‌టించిన త‌ర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల‌ను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయ‌నున్నారు. మొత్తంగా 25,150 మందిని టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేయ‌నుంది.


తెలంగాణలో 501 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి  మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.  ప్రశ్న పత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో మళ్లీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 


గతేడాది ఇలా..
తెలంగాణలో 503 పోస్టులతో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. ఇక ప్రిలిమ్స్ కీలో వెలువడిన అభ్యంతరాల నేపథ్యంలో 5 ప్రశ్నలు తొలగించి కమిషన్ తుది కీ ఖరారు చేసింది. పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో 25 వేల మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ మెయిన్స్‌కు ఎంపిక చేసింది. వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వెలుగుచూడడంతో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష రద్దు చేసి మళ్లీ రీషెడ్యూల్ చేసి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది.


ALSO READ:


APPSC: ఆగస్టు 2 నుంచి 'గ్రూప్‌-1' అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, పూర్తి షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 సర్వీస్‌ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 2 నుంచి 11 వరకు ప్రతిరోజు 30 మంది అభ్యర్థుల చొప్పున, చివరి రోజు మాత్రం 10 మందికి ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తేదీలవారీగా అందుబాటులోఉంచింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో రోజుకు రెండు షిఫ్టుల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(ఎన్‌ఈఎస్‌టీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో (ఈఎంఆర్ఎస్‌) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్‌-టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial