తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు ముగియగా ఫైనల్ పరీక్షలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 12 నుంచి తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నారు.  ఇదిలా ఉండగా తాజా నోటిఫికేషన్లలో కీలకమైన సివిల్ కానిస్టేబుల్ పోస్టు కోసం తలపడుతున్న అభ్యర్థుల్లో పోటీ తక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకొంది. ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశముండటం విశేషం. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ విభాగానికి సంబంధించే అత్యధిక ఖాళీలుండటం.. ఇందులో పోటీ తక్కువగా ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ఎస్‌ఐ పోస్టులకు మాత్రం తీవ్ర పోటీ నెలకొంది.


Also Read: ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్ల ఫలితాలు వెల్లడి, ఎంతమంది అర్హత సాధించారంటే?


ఏ విభాగాలకు ఎంతమంది పోటీ?
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9,54,064 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్ల తర్వాత తుది పరీక్షలకు 90,488 మంది మాత్రమే మిగిలారు. అయితే కీలకమైన సివిల్ విభాగంలోనే 15,644 పోస్టులున్నాయి. ఈనేపథ్యంలో వీటికోసం 90,488 మంది పోటీలో ఉన్నారు. ఈలెక్కన ప్రతీ ఆరుగురిలో ఒకరికి కానిస్టేబుల్ కొలువు దక్కే అవకాశం ఉంది. ఇక ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఒక్కో పోస్టుకు 25 మంది, మెకానిక్ విభాగంలో 56 మంది, డ్రైవర్ విభాగంలో 65 మంది, రవాణా విభాగంలో 143 మంది, ఎక్సైజ్ శాఖలో 97 మంది, అగ్నిమాపకశాఖ ఆపరేటర్ విభాగంలో 12 మంది పోటీలో ఉన్నారు.


Also Read: ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఫైనల్ పరీక్షల షెడ్యూలు ఇదే! 


ఎస్‌ఐ పోస్టులకు తీవ్ర పోటీనే..!
కానిస్టేబుళ్ల కొలువుల కోసం పోటీ తక్కువగా ఉండగా.. ఎస్సై కొలువుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. అన్ని విభాగాల్లో కలిపి 587 పోస్టుల కోసం తొలుత 2,47,630 దరఖాస్తులు నమోదయ్యాయి. తాజాగా శారీరక సామర్థ్య పరీక్షల ఫలితాల అనంతరం వీరిలో 59,574 మంది మాత్రమే మిగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్ విభాగంలోనే ఏకంగా 554 పోస్టులున్నాయి. వీటికోసం 52,786 మంది ప్రస్తుతం పోటీలో ఉండటంతో ఈ విభాగంలో ఒక్కో పోస్టుకు 95 మంది పోటీపడుతున్నారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఒక్కో పోస్టుకు 179 మంది చొప్పున.. పోలీస్ రవాణా విభాగంలో 311 మంది చొప్పున.. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 240 మంది చొప్పున పోటీలో ఉండటం గమనార్హం. తుది రాతపరీక్ష అనంతరం సామాజిక వర్గాల వారీగా కటాఫ్ మార్కుల ఆధారంగా విజేతల ఎంపిక జరగనుంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...