గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ఫ‌లితాల వెల్ల‌డికి తెలంగాణ హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. ఓ అభ్య‌ర్థి స్థానిక‌త వివాదంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలుపై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. అభ్య‌ర్థి స్థానిక‌త వివాదంపై కౌంట‌ర్ దాఖాలు చేయాల‌ని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్ర‌స్తుతానికి గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు విడుద‌ల చేసుకోవ‌చ్చ‌ని కోర్టు సూచించింది. అభ్య‌ర్థి స్థానిక‌త వివాదం త‌ర్వాత తేలుస్తామ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు ప్రారంభించింది. జనవరి 12న సాయంత్రంలోగా ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.


తెలంగాణలో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 16న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్టోబరు 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించి, చివరికి 5 ప్రశ్నలను తొలిగించి, నవంబర్‌ 15న తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ తర్వాత రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-1 పై ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆగిపోయింది. 


ఫలితాల ఆలస్యానికి కారణమిదే..
నిహారిక అనే అభ్యర్థి ఏడో తరగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో చదివారు. ఒకటి నుంచి పీజీ వరకు మాత్రం తెలంగాణలో చదువుకున్నారు. తనకు స్థానికత వర్తిస్తుందని ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఫలితాల విడుదలను టీఎస్పీఎస్సీ ఆపింది. ఆమె స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు చదివిన వాళ్లే స్థానికత వర్తిస్తుందని.. నిహారిక అనే అభ్యర్థి ఏడో తరగతి విశాఖలో చదివిన కారణంగా ఆమెకు స్థానికత వర్తించదని టీఎస్‌పీఎస్సీ తరపున అడ్వకేట్ రాంగోపాల్‌రావు వాదనలు వినిపించారు.


సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల కారణంగా లక్షల మంది గ్రూప్‌ 1 అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఫలితాల వెల్లడికి ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులకు అనుగుణంగా నిహారికకు స్థానికత వర్తింపజేయాలని ఆమె లాయర్‌ సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. వాదనల తర్వాత ఒక్క అభ్యర్థి కారణంగా ఫలితాలను నిలిపివేయడం చెల్లదని, స్థానికత వివాదాన్ని తర్వాత తేల్చుతామని, దీనిపై విచారణ చేసి ఉత్తర్వులు ఇస్తామని డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. ఆ అభ్యర్థికి చెందిన సమగ్ర వివరాలు నివేదించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది కోర్టు. ఫలితాలను వెల్లడించుకోవచ్చునని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. స్థానికత వ్యవహారంపై తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.


రెండు నెలల క్రితమే పూర్తి..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల OMR షీట్ల స్కానింగ్‌ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ రెండు నెలల క్రితమే పూర్తి చేసింది. ఫలితాల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని కమిషన్‌ భావిస్తోంది. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించింది. గతంలో గ్రూప్‌-1 పరీక్ష సమయంలో జరిగిన పొరపాట్లను అంచనా వేస్తూ.. పటిష్ట ప్రణాళికతో ఫలితాల వెల్లడికి అడుగులు వేస్తోంది. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంది. తొలుత ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కోర్టు కేసులతో ఫలితాల్లో జాప్యం జరిగింది. మే 28న సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో ఏప్రిల్‌‌లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే, కోర్టు కేసులతో ఆలస్యం కావడంతో ప్రిలిమ్స్‌ ఫలితాలకు మెయిన్స్‌ పరీక్షకు మధ్య కనీసం మూడు నెలల గ్యాప్‌ ఇవ్వాలని కమిషన్  అనకుంటుంది. అందులో భాగంగానే మే మొదటి వారంలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది.


మెయిన్స్‌కు 25,150 మంది!
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 503 పోస్టులకు గాను 3,80,081 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారిగా ప్రిలిమినరీ ‘కీ’తో పాటే ప్రతి ఒక్క అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, గ్రూప్‌-1 ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలోనే వెల్లడించింది. అంటే, 503 ఉద్యోగాలకు మొత్తం 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. మల్టీజోన్‌, రిజర్వుడ్‌ వర్గాల వారీగా జాబితాను టీఎస్‌పీఎస్సీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఫలితాలు వెల్లడైనా వెంటనే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కమిషన్‌ భావిస్తోంది. అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీపై వారం, పదిరోజుల్లోనే స్పష్టత రానున్నది.


ఆందోళన వద్దు: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌
'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ ఫలితాలపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి. జనార్దన్‌ రెడ్డి హామీ ఇస్తున్నారు. అక్టోబర్‌‌లోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు వెల్లడించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. కాని అనుకోని ఇబ్బందులు తలెత్తడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. మెయిన్స్‌ పరీక్ష గురించి అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, మిగిలిన పరీక్ష తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. అభ్యర్థులకు వేరే పరీక్షలు లేకుండా అన్ని విధాలా ఆలోచించి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తామని, ప్రిపరేషన్‌ను సైతం దృష్టిలో పెట్టుకునే మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడించిన తర్వాత మెయిన్స్‌ పరీక్షకు తప్పనిసరిగా మూడు నెలల సమయం ఇస్తామని జనార్దన్‌ రెడ్డి తెలిపారు.