తెలంగాణలో ఉద్యోగాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పోలీసు నియామకాల ప్రక్రియ కొనసాగుతుండగా, గ్రూప్-4 నోటిఫికేషన్ కూడా వెలువడింది. మరోవైపు వైద్యారోగ్యశాఖలోనూ ఖాళీల భర్తీకి తెరలేచింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వైద్య కళాశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా పల్లె దవాఖానాల్లో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ డిసెంబరు 7న ఉత్తర్వులు(జీవో నెంబర్ 1563)  జారీ చేసింది. వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు.


పోస్టుల వివరాలు...



రాష్ట్రంలో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా వైద్య ఆరోగ్యశాఖ మార్చుతోంది. అయితే ఇప్పటికే ఈ సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు, ఆశాలు రోగికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఇప్పుడు వీటిని పల్లె దవాఖానాగా మార్చుతూ, వాటిల్లో 1,492 మంది వైద్యులను నియమిస్తుండటంతో, మరింత నాణ్యమైన సేవలు పల్లెల్లో అందనున్నాయి. రాష్ట్రంలోని 3,206 సబ్ సెంటర్లలో 1492 మంది వైద్యుల నియామకం చేయనుండగా, మరో 636 సబ్‌ సెంటర్లు పీహెచ్‌సీల పరిధిలోనే ఉన్నాయి. అంటే మొత్తంగా 3842 సబ్ సెంటర్లలో డాక్టర్‌ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇక నుండి పల్లె ప్రజలకు అనారోగ్యం వస్తే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పల్లెల వద్దకే వైద్య సేవలు అందించనున్నాయి. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలకు మాత్రమే పెద్దాసుపత్రులకు వెళ్లడం తప్ప, పల్లెల సుస్తీని ఇక పల్లె దవాఖనాలే పొగొట్టనున్నాయి.


ఇదీ ప్రయోజనం..
పల్లె దవాఖానాల్లో అవసరమైన వ్యాధి నిర్ధార‌ణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని 'టీ డయాగ్నస్టిక్స్' కు పంపుతారు. అక్కడి నుండి వచ్చిన వ్యాధి నిర్ధారణ ఫలితాలను బట్టి వైద్యులు అవసరమైన చికిత్సను అందిస్తారు. ప్రాథ‌మిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు సీహెచ్ సీ లేదా ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు.






Also Read:


తెలంగాణ వైద్య కళాశాలల్లో 184 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు/ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులలో ఏడాది కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబరు 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలో వైద్య విద్యపూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబరు 20న ఉద‌యం 10:30 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 5న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మ‌ధ్య వ‌య‌సున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అన‌స్థీషియాలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జరీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...