TS TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన పూర్తిస్థాయి (సమగ్ర) నోటిఫికేషన్‌ విడుదల మరింత ఆలస్యమయ్యేలా ఉంది. రాష్ట్రంలో టెట్‌ నిర్వహణకు గతంలో జారీచేసిన జీవోలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో టెట్ నోటఫికేషన్ ఒకట్రెండు రోజులు ఆలస్యంగా వెలువడే అవకాశముంది. టెట్‌ నిర్వహణకు గతంలో రాష్ట్రప్రభుత్వం జీవో -36ను జారీచేసింది. అయితే ఈ జీవోలో 1-8వ తరగతుల బోధనకు మాత్రమే టెట్‌ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది.


స్కూల్‌ అసిస్టెంట్‌, హెచ్‌ఎంల పదోన్నతులకు టెట్‌ తప్పనిసరిచేస్తూ ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పదోన్నతులు కల్పించాలంటే టెట్‌ అర్హత అడ్డంకిగా మారింది. తాజాగా నిర్వహించే టెట్‌లో తమకు అవకాశం కల్పించాలని టీచర్లు కోరుతున్నారు. దీంతో టెట్‌ నిబంధనలు మార్చాల్సి ఉంది. దీంతో పాటు టెట్‌ను ఏటా డిసెంబర్‌, జూన్‌లో నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. జీవో-36లో టెట్‌ను ఏటా ఒకసారి నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనిని కూడా సవరించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలోనే టెట్‌‌కు సంబంధించిన సమాచార బులిటిన్‌ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం.


27 నుంచి 'టెట్' దరఖాస్తుల స్వీకరణ..
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 27 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్‌ 3 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ కంటే ముందే టెట్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల మంది డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఎస్సీ రాతపరీక్షలను జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్ నిర్వహణ తప్పనిసరి కావడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును విద్యాశాఖ జూన్‌ 20 వరకు పొడిగించింది.


తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'మెగా డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. టెట్ నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 2 నుంచి జూన్ 20 వరకు పొడిగించారు. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 లాంగ్వేజ్ పండిట్, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.


సందేహాల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్‌..
డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది


తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..