Singareni Junior Assistant Jobs: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌(క్లరికల్‌) పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 4న నిర్వహించనున్న రాత పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 177 పోస్టులకు జరుగుతున్న ఎగ్జామ్‌కు ఇప్పుడు 98,880 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వారం ముందునుంచే అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు.  



Junior Assistant Grade-II (External) Hall Ticket Download


187 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..

సింగరేణి రాత పరీక్ష కోసం యాజమాన్యం 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో రెండు రీజియన్లు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొత్తగూడెం సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్‌లోనే 39 సెంటర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. కొత్తగూడెంలో 35 సెంటర్లు, మంచిర్యాలలో 28, ఖమ్మంలో 23, హైదరాబాద్‌ –1లో 19, హైదరాబాద్‌ –2లో 14, వరంగల్‌లో 18, ఆదిలాబాద్‌లో 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కొ రీజియన్‌కు పరీక్షల నిర్వహణ కోసం చీఫ్‌ కో–ఆర్డినేటర్లను నియమించారు. 

నెగెటివ్‌ మార్కులు సైతం..
జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలకు భారీగా ధరఖాస్తులు రావడంతో సింగరేణి యాజమాన్యం ఈ సారి నెగెటివ్‌ మార్కుల నిబంధన రూపొందించింది. మరోవైపు 120 మార్కులకు ఉండే ఈ పరీక్షలకు కేవలం రెండు గంటల సమయంతోపాటు నెగెటివ్‌ మార్కులను ఏర్పాటు చేయడం గమనార్హం. తప్పు సమాధానం ఇస్తే మార్కులు తగ్గుతాయి. 


పరీక్షల కోసం గట్టి నిఘా..

2015లో సింగరేణి సంస్ధ నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల రిక్రూట్‌ మెంట్‌లో అవతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీరింగ్‌ పరీక్షల సందర్భంగా మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కొంత మంది దొరక్కడంతో ఈ దపా ఎలాంటి అవతవకలు జరగకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం పరీక్షల నిర్వహణపై దళారుల మాటలు నమ్మవద్దని ప్రచారం చేయగా మరోవైపు పోలీస్‌ శాఖ సహకారం కూడా తీసుకున్నారు. వరుసగా రెండు సార్లు జరిగిన రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఇప్పుడు అలాంటివి జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా 177 పోస్టుల కోసం ఏకంగా లక్షల మందికిపైగానే ధరఖాస్తు చేసుకోవడం.. 98,880 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరవుతుండటంతో ఈ సారి సింగరేణి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఆరోపణలు రాకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...