RRB 2024 Annual Calendar: దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్లలో ఖాళీల భర్తీకి సంబంధించిన ఉద్యోగ వార్షిక క్యాలెండర్‌-2024ను రైల్వే రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్స్, నాన్ టెక్నికల్, పారామెడికల్, మినిస్టీరియల్, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల వెల్లడి షెడ్యూలును పొందుపరిచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల నియామక ప్రక్రియ జనవరి నుంచి మార్చి వరకు కొనసాగనుంది. అలాగే టెక్నీషియన్ పోస్టుల ప్రక్రియ ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగనుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ-గ్రాడ్యుయేట్(లెవల్ 4, 5 & 6), నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ-అండర్ గ్రాడ్యుయేట్(లెవల్ 2 & 3), జూనియర్ ఇంజినీర్, పారామెడికల్ కేటగిరీలకు జులై నుంచి సెప్టెంబరు మధ్య నోటిఫికేషన్లు వెల్లడికానున్నాయి. ఇక లెవల్ 1, మినిస్ట్రీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీలకు సంబంధించి అక్టోబరు నుంచి డిసెంబరు వరకు నోటిఫికేషన్లు, దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.  


➥ అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు సంబంధించిన జూన్ నుంచి ఆగస్టు మధ్య స్టేజ్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ-1) నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబరులో స్టేజ్-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ-2) నిర్వహించనున్నారు.  అదేవిధంగా నవంబరులో కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT) నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్ పరీక్ష ముగిసిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నవంబరు-డిసెంబరు మధ్య నిర్వహిస్తారు. అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టుల నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని 18-30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అయితే వయోపరిమితిని మూడేళ్లు పెంచుతున్నట్లు రైల్వేశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఏఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 18-33 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపింది. అయితే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 


అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులకు సంబంధించి జనవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ALP Online Application


➥ దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 9000 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రైల్వేశాఖ రెండురోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగార్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూస్తూ ఉండాలని తెలిపింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మార్చి నుంచి ఏప్రిల్ మధ్య దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, అర్హులైనవారందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ముందుంటాయని పేర్కొంది. టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు తదితర వివరాలన్నీ నోటిఫికేషన్ వెల్లడించిన తర్వాత తెలుసుకోవచ్చని సూచించింది. 



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..