తెలంగాణలో 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల భర్తీకి వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) విధానాన్ని గురుకుల నియామక బోర్డు ప్రవేశపెట్టింది. ఓటీఆర్‌ నమోదుతో కేటాయించే నంబరుతో నోటిఫికేషన్ల వారీగా అర్హత కలిగిన గురుకుల పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ.. ఈ సదుపాయాన్ని గురుకుల నియామక బోర్డు ఏప్రిల్‌ 12 నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఓటీఆర్‌ నమోదు చేస్తేనే గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈమేరకు ఓటీఆర్‌ నమోదుకు సంబంధించిన వెబ్‌లింక్‌ను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 


ఓటీఆర్‌ నమోదు కోసం తొలుత ఆధార్‌ నంబరు నమోదు చేయాలి. ఆ తరువాత వ్యక్తిగత వివరాలు పూర్తిచేయాలి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 వరకు చదివిన జిల్లాను నమోదు చేయాలి. అనంతరం ఓటీఆర్‌ పూర్తవుతుంది. తరువాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు దరఖాస్తు చేసేందుకు వీలు కలుగుతుంది. ఓటీఆర్‌ నమోదు తరువాత యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సహాయంతో లాగిన్‌ అయి.. అర్హత కలిగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పరీక్ష ఫీజు చెల్లించి, మిగతా వివరాలు నమోదు చేస్తే దరఖాస్తు పూర్తవుతుంది. ఓటీఆర్‌ నమోదు చేస్తేనే  పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎక్కువ సమయం వేచిచూడకుండా వెంటనే ఓటీఆర్‌ నమోదు పూర్తిచేయాలని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.


Website


అందుకే ఓటీఆర్ విధానం... 
ఉపాధ్యాయ బోధన విద్యార్హత కలిగిన అభ్యర్థులకు తాము చదివిన డిగ్రీ, పీజీ కోర్సుల మేరకు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు బోధించేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపోస్టుకు దరఖాస్తు చేసేందుకు వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి రావడం, తప్పులు దొర్లితే సవరణలకు బోర్డు కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడం లాంటి సమస్యల్ని అధిగమించడానికి.. దరఖాస్తు ప్రక్రియను సరళం చేసేందుకు బోర్డు ఓటీఆర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఓటీఆర్‌లో రిజిస్టరు అయిన తరువాత రిజిస్ట్రేషన్‌ నంబరుతో విద్యార్హతల మేరకు బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్లలో సబ్జెక్టుల వారీగా నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది.


దరఖాస్తు తేదీలివే..
గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17  నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.  గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక  గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్  పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. 


పోస్టులవారీగా నోటిఫికేషన్లు, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..