తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ ఏడాదైనా ఉద్యోగాలు పొందాలన్న వారి కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ పక్క పరీక్షల నిర్వహణ చేతకాక డీలాపడిపోయిన టీఎస్‌పీఎస్సీ, మరోపక్క పోలీసు ఉద్యోగాల నియామకాల్లో కోర్టు కేసులు వెరసి.. నిరుద్యోగ యువత ఓర్పును పరీక్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష రెండుసార్లు రద్దయింది. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ షెడ్యూలు మారాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి చేరింది. దీంతో ఉద్యోగార్థులో నిరుత్సాహం, అసహనం పెరిగిపోతున్నాయి.


తాజాగా కానిస్టేబుల్ ఫలితాలకు హైకోర్టు బ్రేక్ వేయడంపై ఎంపికైన అభ్యర్థులు షాక్ అవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఉద్యోగాల భర్తీ పూర్తి అవ్వలేదని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండుసార్లు వాయిదాపడటం, గ్రూప్-2 పరీక్ష నిరవధిక వాయిదా పడగా.. గ్రూప్-4 ఫలితాలు ఇంకా వెలువడలేదని మండిపడుతున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూలు వచ్చిందని, ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్లేనని ఆవేదన చెందుతున్నారు.


డీఎస్సీ కూడా వాయిదా?
రాష్ట్రంలో నవంబరు 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అయితే నవంబరు 30న ఎన్నికలు జరుగనున్నాయి. నవంబరు నెలమొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటాయి. దీంతో షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సాముగా మారింది. పరీక్ష వాయిదా విషయంపై విద్యాశాఖ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అక్టోబర్ 21 వరకు డీఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 


ALSO READ:


తెలంగాణ డీఎస్సీ పరీక్షలు వాయిదా? ఆందోళనలో అభ్యర్థులు- ఎందుకంటే!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం ఎట్టకేలకు వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పుడిదే డీఎస్సీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో నవంబరు 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజు డీఎస్సీ, పోలింగ్ ఉండటంతో పరీక్షలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు హైకోర్టు బ్రేక్, ఎప్పటివరకంటే!
తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ జరిగిన తరువాతే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ 2022, ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..