తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్‌-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.


మరోవైపు పోటీ పరీక్షలకు సీరియస్‌గా సన్నద్ధమయ్యేవారు మాత్రం పరీక్షలను వాయిదా వేయొద్దని కోరుతున్నారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది . ఇప్పటికే గ్రూప్‌-3 పరీక్ష నిర్వహణకు తేదీలు అందుబాటులో లేవు. సంక్షేమ వసతిగృహాల అధికారులు, డీఏవో పరీక్షలదీ ఇదే పరిస్థితి.


ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1 మెయిన్స్‌ తేదీల ఖరారు టీఎస్‌పీఎస్సీకి పెద్ద పరీక్షగా మారింది. ఇలాంటి తరుణంలో మరో ప్రధాన పరీక్షను వాయిదా వేయడం సాధ్యంకాదని ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్‌ అభిప్రాయపడింది. ఒకసారి పరీక్షను వాయిదావేస్తే మళ్లీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని, కనుక ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ ఏకాభిప్రాయానికి వచ్చింది.


డిసెంబర్‌ వరకు బిజీ షెడ్యూలు..
టీఎస్‌పీఎస్సీ సాధారణంగా శని, ఆదివారాల్లో ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. కానీ, ఈ ఏడాది డిసెంబర్‌ వరకు శని, ఆదివారాల్లో పరీక్షల షెడ్యూల్‌ బిజీగా ఉంది. ఆగస్టులో సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (సీఆర్‌పీఎఫ్), ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఐబీపీఎస్‌ క్లర్‌ ఉద్యోగాలకు.. సెప్టెంబర్‌లో ఐబీపీఎస్‌ క్లర్స్‌, ఎన్‌డీఏ, సీడీఎస్‌, ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ, సివిల్స్‌ మెయిన్స్‌, ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ పోస్టులకు పరీక్షలు ఉన్నాయి. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఐబీపీఎస్‌, యూపీఎస్సీ, ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ పరీక్షలు ఉన్నాయి. ఇక డిసెంబర్‌లో మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్షతోపాటు యూపీఎస్సీ, ఐబీపీఎస్‌ స్పెషలిస్టు పోస్టులకు పరీక్షలు జరగనుండటంతో ఈలోపే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3, గ్రూప్‌-1 మెయిన్స్‌ లాంటి కీలక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా పరీక్షను వాయిదా వేస్తే దాన్ని మళ్లీ ఈ ఏడాది తిరిగి నిర్వహించడం కష్టమే. దీంతో ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన పరీక్షలన్నీ షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని, ముఖ్యంగా గ్రూప్‌-2 పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని కమిషన్‌ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.


ALSO READ:


తెలంగాణ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు, ఎంపికైతే భారీగా జీతభత్యాలు
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ప్యాకల్టీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 23 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అయితే వీరికి రెగ్యులర్‌ ఉద్యోగులకన్నా ఎక్కువ జీతాలు ఇవ్వనుండటం విశేషం. కేవలం ఏడాది కాలానికి మాత్రమే ఈ నియామకాలను భర్తీ చేయనున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పెంచుతారు. రెగ్యులర్‌ నియామకాలు చేపడితే మాత్రమే వీరు ఉద్యోగాల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలు ఉండగా.. వాటిలో గాంధీ, ఉస్మానియా, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలను మినహాయించి మిగిలిన 23 కాలేజీల్లో పోస్టులు భర్తీ కానున్నాయి. 
నోటిఫికేష్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..