అగ్నిపథ్ అమలులోకి వచ్చాక ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలకు ఎలాంటి స్పందన వస్తుందోననే అనుమానాలు అందరిలో ఉన్నాయి. అయితే అలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆర్మీకి ఎంపికవ్వాలనుకుంటున్న అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ర్యాలీకి పోటెత్తారు. నెల్లూరులో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ తొలిరోజే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 12 రోజులపాటు నెల్లూరులో ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగుతుంది. 




అగ్నిపథ్ పథకం అమలులోకి రావడంతో ఇప్పుడు అగ్నివీర్ లు గా విధులు నిర్వర్తించేవారికోసం సైన్యం రిక్రూట్ మెంట్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్నివీర్ లకు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 26 వరకు అగ్నివీర్ ల ఎంపిక జరుగుతుందని అధికారులు తెలిపారు. 




ఎవరెవరు..?
దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ లోని అభ్యర్థులంతా నెల్లూరులో జరిగే ర్యాలీకి హాజరు కావాల్సి ఉంటుంది. రాయలసీమ జిల్లాలు, గుంటూరు జోన్‌ ప్రాంతంలోని అభ్యర్థులు ఇక్కడికి వస్తున్నారు. 34వేల మందికిపైగా అభ్యర్థులు అగ్నివీర్ ఉద్యోగాలకోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 970 మంది నెల్లూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు బుధవారం సాయంత్రమే నగరానికి చేరుకున్నారు. 




పన్నెండేళ్ల తర్వాత.. 
పన్నెండేళ్ల తర్వాత నెల్లూరు జిల్లాలో ఆర్మీ ర్యాలీ జరుగుతోంది. దీనికోసం అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ర్యాలీలో భాగంగా రన్నింగ్ రేస్ జరిగే సమయంలో నగరవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు అధికారులు. నెల్లూరులో జరుగుతున్న ఈ ర్యాలీ ద్వారా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌ మెన్‌ (టెన్త్ పాస్ అయినవారు) అగ్నివీర్‌ ట్రేడ్‌మెన్‌(ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైనవారు) ని ఎంపిక చేస్తారు. 




రోజుకి 3వేలమంది.. 
రిక్రూట్ మెంట్ ర్యాలీకి వచ్చిన అభ్యర్థులను ముందుగా నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణకు చేరుకుంటున్నారు. అక్కడ హాజరు తీసుకుని వారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత హైట్ పరిశీలిస్తారు. హైట్ లో రిజెక్ట్ అయితే వెంటనే వెనక్కి పంపిస్తారు. హేట్ సెలక్ట్ అయినవారిని మాత్రమే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోకి పంపిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనకోసం ఆసుపత్రి ఆవరణలో మొత్తం 10 కంపార్ట్‌ మెంట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో దానిలో 300 మందికి ప్రవేశం ఉంది. ఇలా రోజుకి 3వేలమందికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ముందు వచ్చినవారికి ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. ఆన్ లైన్లో అడ్మిట్ కార్డ్ లు డౌన్ లోడ్ చేసుకుని రిక్రూట్ మెంట్ ర్యాలీకి రావాల్సి ఉంటుంది. 


గడ్డం ఉండకూడదు.. 
ఆర్మీ ఎంపికకు వచ్చే అభ్యర్థులను తమ సోదరులు, పిల్లలుగా భావించాలని అధికారులకు సూచించారు గుంటూరు రేంజ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ కల్నల్‌ కోహ్లి. ప్రతిభ ఆధారంగానే పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయన్నారు. ఎ1వరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అభ్యర్థులు తమ వెంట సెల్‌ ఫోన్లు తీసుకురాకూడదన్నారు. గడ్డం ఉంటే అనుమతించబోమని చెప్పారు.