Bigg Boss 6 Telugu: ఈ రోజు విడుదలైన మొదటి ప్రోమోలో ఇంటి సభ్యులంతో ‘జీవితంలో పిల్లలు ఎంత ముఖ్యమో’ చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. చూసిన ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఇక రెండో ప్రోమోల మాత్రం ఇల్లు డాన్సులతో కళకళ లాడిపోయింది. కెప్టెన్సీ పోటీదారులంతా తమకు ఓటు వేయమని కోరుతూ, కొన్ని వరాలనూ ప్రకటించారు. 


డీజే పెట్టి మరీ...
ఇంట్లో కెప్టెన్సీ కంటెండర్ల పోటీ కోసం ‘నాచో నాచో టాస్క్’ పెట్టారు బిగ్ బాస్. ఇందులో డీజే కూడా ఏర్పాటు చేశారు. నలుగురు కెప్టెన్సీ దారులకు ఒక్కో డీజే ఉంటుంది. మధ్య మధ్యలో కెప్టెన్సీ పోటీదారులు తమకు ఓటేయమని ప్రచారం చేశారు. చంటి తనను కెప్టెన్ గా చేస్తే బెల్ మోగినా కూడా మరో అరగంట ఎక్కువ నిద్రపోనిస్తానని అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఇనయా మాట్లాడుతూ ‘అమ్మాయిలు రావాలి, అమ్మాయి రాజ్యం రావాలి, అమ్మాయిలూ నాకు సపోర్ట్ చేస్తారా?’ అని అడిగింది. దానికి అమ్మాయిలంతా ఓ అని అరిచారు. ఇక రాజశేఖర్ మాట్లాడుతూ ‘నాకు ఓటేస్తే...’ అని ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు. దీంతో అందరూ నవ్వేశారు. 21 మందికి టీ పెడితే ఎన్ని స్పూన్ల పంచదార వేయాలి? అని చంటి రాజశేఖర్ ని అడిగాడు. దానికి రాజ్ ‘30 స్పూన్లు’ అని చెప్పాడు. దాంతో అందరూ నవ్వారు. ‘టీ ఎట్లా పెట్టాలో తెలియదు నువ్వొక కెప్టెన్సీ పోటీదారుడివి’ అంటూ జోకులేశాడు చంటి. 






పాట ఆగగానే ఇద్దరు ఇంటి సభ్యులు వచ్చి ఎవరికి ఓటేస్తారో చర్చించుకోవాలి. మొదట రేవంత్ - గీతూ వచ్చారు. రేవంత్ సూర్య, చంటిల్లో ఎవరో ఒకరికి ఓటేస్తానని చెప్పారు. గీతూ మాత్రం రాజ్ పేరు చెప్పింది. వాసంతి-శ్రీ సత్య, ఫైమా - అర్జున్, షానీ - శ్రీహాన్... ఇలా జంటలుగా పిలిచారు బిగ్ బాస్. ప్రతి జంట ఏకాభిప్రాయంతో ఒకరికి ఓటు వేయాలి. నలుగురిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కెప్టెన్ అవుతారు.  సూర్య ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదు కానీ చివర్లో ‘నువ్వు వాడు వెన్నుపోటు పొడుస్తాడు అన్నావ్, నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు చూశా’ అంటూ డైలాగ్ వేశాడు. అది శ్రీహాన్ గురించేనని ప్రేక్షకుల అనుమానం. చివరికి చంటినే ఇంటి కెప్టెన్ చేసినట్టు సమాచారం.



Also read: నాలుగో నెలలో బిడ్డను పొగొట్టుకున్న మెరీనా - రోహిత్, ఎమోషన్‌తో నిండిపోయిన బిగ్‌బాస్ ఇల్లు


Also read: రాత్రిపూట దొంగాటలు ఆడిన గీతూ, ఈ వారం కెప్టెన్సీకి పోటీపడేది ఆ నలుగురు