రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీలపై MCR HRDలో సమీక్ష నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు ప్రకటిస్తామన్నారు. ఈనెల 28న 9జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రిన్సిపాల్స్, ఇంజినీర్లతో కాలేజీల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు.


9 మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 67 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరిదశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రోవిజనల్ మెరిట్ లిస్టు విడుదలచేసి, 10రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలింగ్ నిర్వహించి 9 మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించాలన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్,  పలు జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. 9 కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. తరగతులు ప్రారంభంమయ్యే నాటికి అవసరమైన ఫర్నిచర్, వగైరా సిద్దం చేయాలని ఆదేశించారు.


 


గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుండి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు. NMCనిబంధనలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు లేకుండా చూడాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బృందం పరిశీలనకు వస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగులో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని ఆర్థికశాఖకు సూచించారు. మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేసేందుకు, ఈనెల 28న 9జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాకలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపల్స్, ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. వచ్చే వారంరోజుల్లో 9 కొత్త మెడికల్ కాలేజీలు సందర్శించి, పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంఈ రమేష్ రెడ్డిని మంత్రి ఆదేశించారు.


వచ్చే జూలై ఆగస్టు నాటికి అకడమిక్ ఇయర్ ప్రారంభమైతే కొత్తగా 9 జిల్లాల్లో విద్య, వైద్యం ప్రజలకు మరింత చేరువ అవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు సాధిస్తే, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరుతుందని అన్నారు. MBBS సీట్లసంఖ్య 3,690 కి పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 26కు చేరుతుండటం వైద్యం, విద్యను బలోపేతం చేయాలన్న సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం అన్నారు. 60 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, గడిచిన 8, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు రావడం గొప్ప విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదనీ, అయినప్పటికీ వెనుకాడకుండా సీఎం కేసీఆర్ ప్రజలకు వైద్యం, వైద్య విద్యను చేరువ చేసేందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. దేనికి అనుగుణంగా వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.