తెలంగాణలో ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఇప్పటిదాకా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈమేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో నియామక ప్రక్రియ ముందుకు సాగనుంది.


రాష్ట్రంలో సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించిన మార్కులను కలపాలని  సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను కొట్టేస్తూ హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పు వెల్లడించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయంతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పోలీసు నియామక మండలిని హైకోర్టు ఆదేశించింది. అభ్యంతరాలు ఉన్న నాలుగు ప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని స్పష్టం చేసింది.


కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని కొంత మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. అభ్యర్థులు లేవనెత్తిన ఆ నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసు నియామక మండలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న హైకోర్టుల డివిజన్ బెంచ్ ఆ ప్రశ్నలపై అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలిని హైకోర్టు ఆదేశించింది.


వివాదం ఇక్కడే..
తెలంగాణలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు రాష్ట్ర హైకోర్టు బ్రేకులు వేసింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ జరిగిన తరువాతే కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ చేయాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ 2022, ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. 


కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబరు 4న విడుదల చేసింది. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు తెలిపింది. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు (TS Police Constable Results) కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది.


మరోవైపు, పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు అక్టోబర్ 5వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు బోర్డు స్పష్టం చేసింది.


నియామక ప్రక్రియలో కొత్త తగాదాలు
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త తగాదాలు తలెత్తుతున్నాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థుల కటాఫ్ మార్కుల కంటే, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 


తెలంగాణ పోలీసుశాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 587 సబ్ ఇన్‌స్పెక్టర్;16,604 కానిస్టేబుల్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షల మంది యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దీంతో ఈ నోటిఫికేషన్‌కు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించబోవని బోర్డు పేర్కొంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...