తెలంగాణ(Telangana)లో ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications) ఈనెలలోనే రానున్నాయి. ఈ నెలలోనే ఏ క్షణమైనా నోటిఫికేషన్ రానుంది. దీనికి ఆధికారులు వేగంగా ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పోస్టుల వివరాలు చెప్పేసిన ప్రభుత్వం ఒక్కో నోటిఫికేషన్‌కు కాస్త గ్యాప్‌ ఉండేలా ప్లాన్ చేస్తోంది. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు సమస్య రాకుండా ప్రయత్నాలు చేస్తోంది. 


నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూనే అభ్యర్థులకో మరో గుడ్‌ న్యూస్ చెప్పనుంది ప్రభుత్వం. గ్రూప్‌1,2 పోస్టులకు ఇంటర్వ్యూ ఎత్తివేయాలని నిర్ణయించనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించింది సాధారణ పరిపాలన శాఖ. దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించింది. ఇప్పుడు బంతి సీఎంవో కోర్టులో ఉంది. అక్కడ కానీ దీనికి ఓకే చెబితే అభ్యర్థులకు నిజంగానే గుడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. 


ఇంటర్వ్యూలను ఎత్తివేసిన తర్వాత నోటిఫికేషన్‌లు విడుదల చేసే ఛాన్స్ ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అందుకే కాస్త ఆలస్యమవుతోందని చెబుతున్నారు అధికారులు. జీఏడీ పంపించిన ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాసెస్‌ అంతా పూర్తై మరో పది పదిహేను రోజుల్లో గ్రూప్‌ 1 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్‌ ఉంది. 


మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుతున్న అభ్యర్థులకు మరో శుభవార్త చెప్పింది. కోచింగ్‌ల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టలేని వాళ్లకు ప్రభుత్వం చదివించనుంది. స్టైఫండ్‌ ఇస్తూనే గ్రూప్‌ 1, 2లకు ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఇస్తోంది. 






తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్లు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 16లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 16 ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి 21 నుంచి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. లక్షా పాతిక వేల మందికి ఈ కోచింగ్ ఇవ్వనున్నారు. 


16న నిర్వహించే పరీక్షలో టాపర్స్‌ పదివేల మందికి స్టైఫండ్‌ ఇస్తారు. గ్రూప్‌ వన్‌ అభ్యర్థులకు ఆరునెలలపాటు నెలకు ఐదువేల రూపాయలు, గ్రూప్‌ 2 అభ్యర్థులకు మూడు నెలల పాటు 2వేల రూపాయలు ఎస్సై అభ్యర్థులకు నెలకు రెండు వేల రూపాయలు స్టైఫండ్‌ ఇస్తారు.