CM Revanth Reddy Review on Education Dept: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు కొత్త సంవత్సర శుభవార్త వినిపించారు. మెగా డీఎస్సీ (TS Mega DSC) ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై డిసెంబరు 30న సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలోని సమస్యలపై చర్చించారు. టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లలో ఉన్న సమస్యలు, అవాంతరాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని సూచించారు. విద్యాలయాలకు పారిశ్రామిక కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేయకుండా.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.


ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలు..
ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతులను తయారు చేయాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. మహబూబ్ నగర్‌లో కొడంగల్‌లో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, అలాగే, మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారిని సీఎం ఆదేశించారు.


టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు సచివాలయంలో డిసెంబరు 30న భేటీ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు రేవంత్‌తో ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలో సుమారు రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులకు ప్రణాళిక రూపొందించిన టాటా టెక్నాలజీస్.. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐటీఐ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రతిపాదించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం టాటా టెక్నాలజీస్ సంస్థ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టి.. కాలం చెల్లిన కోర్సుల స్థానంలో ఆధునిక కోర్సులను ప్రవేశ పెట్టాలని సీఎం సూచించారు.