Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'మెగా డీఎస్సీ'లో ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయుడు సూచించారు. సచివాలయంలో జులై 2న ఏపీటెట్, డీఎస్సీ నిర్వహణపై అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా 'మెగా డీఎస్సీ'ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


మెగా డీఎస్సీ, టెట్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని మంత్రి సూచించారు. పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీఓ-117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు.


ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఔట్‌సోర్సింగ్ టీచర్ల  డిమాండ్లపై అధ్యయనం చేసి, వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో టెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు చేయలేదని, గత టెట్ సిలబస్‌నే కొనసాగిస్తున్నామని, వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 


ఏపీటెట్(జులై)-2024 ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?


వయోపరిమితి సడలింపుపై చర్చించి నిర్ణయం..
అధికారులతో మంత్రి లోకేశ్ నిర్వహించిన సమావేశంలో మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపు అంశం ప్రస్తావనకు రాగా.. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు తక్కువగా ఎస్జీటీ పోస్టులు ఉన్నట్లు తన దృష్టికి వచ్చినట్లు మంత్రి ప్రస్తావించగా.. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయమై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు తెలిపారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని మంత్రి సూచించారు. ప్రైవేటు పాఠశాల అనుమతుల రెన్యువల్ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని కోరారు. 


విద్యార్థులకు నైపుణ్య శిక్షణ..
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలు గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు 'నైపుణ్య గణన' కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని 'స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్' అధికారులతో మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ విషయమై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, మెరుగైన విధానాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 


ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి..
ఉండవల్లిలో జులై 2న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి లోకేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి కృషి మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, అధికారులు, పలు వర్గాలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన సంస్కరణలు అమలు చేస్తామన్నారు. ఉత్తర్వులు-117 రద్దు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, టీచర్లకు బోధనేతర పనిభారం లేకుండా ఉండేందుకు అవసరమైన సంస్కరణలపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. 









మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..