ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ జనవరి 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌‌లో ఆన్సర్ కీతోపాటు క్వశ్చన్ పేపర్లను అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ప్రాథమిక ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. 

 

ఆన్సర్ కీపై జనవరి 11 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా లేదా వాట్సాప్ లేదా, SMS ఇలా వేరే ఏ ఇతర మార్గాల్లోనూ అభ్యంతరాలు స్వీకరించరు. ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసిన ప్రత్యేక లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు సంబంధించిన సమాచారం, ఆధారాలను పీడీఎఫ్ ఫార్మట్లో జతచేయాలని, వెబ్‌సైట్లు, సోర్సుల పేరిట ఇచ్చిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నలకు రూ.100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 


 

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీలు ఇలా..



మూడువారాల్లోనే ఫలితాలు..? 
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది కీని విడుదల చేస్తారు. తుది కీతోపాటు ఫలితాలను మూడు వారాల్లోనే విడుదల చేయనున్నారు. ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఆగస్టు నాటికి నియామకాలు పూర్తిచేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.





ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు.ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అంటే 82.38 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా నంద్యాల జిల్లా 85.89 % మంది అభ్యర్థులు హాజరుకాగా, అత్యల్పంగా కృష్ణా జిల్లా (73.99%) జిల్లా నుంచి హాజరయ్యారు.

 

యూపీఎస్సీ స్థాయిలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం! కటాఫ్‌ మార్కులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష ప్రశ్నపత్రం తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం.. ఉద్యోగార్థుల సత్తా పరీక్షించేందుకే ఎక్కువ నిడివిగల ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మొత్తంగా ప్రిలిమ్స్ పరీక్ష కఠినంగా ఉన్నట్లు ఎక్కువ మంది తెలిపారు. యూపీఎస్సీ స్థాయిలో ప్రశ్నపత్రం ఉందని చెప్పారు.

ప్రశ్నపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రశ్నలు అడిగారు. ఉదయం నిర్వహించిన పేపర్-1లో ఏపీ ఎకానమీ విభాగంలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్, నవరత్నాలు, దిశ యాప్, కౌలు రైతులు, పోలవరం అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఇక మధ్యాహ్నం నిర్వహించిన పేపర్-2 కరెంట్ అఫైర్స్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో నవరత్నాల్లో భాగం కానిది ఏది? ఆపదలో ఉన్న మహిళల కోసం ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎస్‌వోఎస్ సేవ ఏది? తదితర ప్రశ్నలు వచ్చాయి. వీటితోపాటు మత్స్యకార భరోసా, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, మైనారిటీలకు ప్రత్యేక బడ్జెట్, ఉర్దూ అధికార భాషగా ప్రకటన, విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఓడరేవుల నిర్మాణం, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులు, ఇటీవల నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంశాలపై ప్రశ్నలు అడిగారు. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.. 

 


Also Read:


APPSC: గుడ్ న్యూస్, త్వరలో 'గ్రూప్-2' నోటిఫికేషన్! పోస్టులెన్నో తెలుసా?
ఏపీలోని ఉద్యోగార్థులు ఒకవైపు 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 'గ్రూప్-2' పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు - ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇక మీదట ప్రిలిమ్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్షను కూడా నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పటి నుంచి మెయిన్స్ పరీక్షలోనూ మూడు పేపర్ల స్ధానంలో రెండు పేపర్లే ఉండనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధికశాఖ జనవరి 6న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...