Recruitment of Special Education Teachers: ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 2,260 పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఖాళీల్లో 1,136 స్పెషల్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు; 1,124 స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదపడనుంది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు ఇలా..ఉమ్మడి జిల్లాల వారీగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్జీటీ పోస్టులను ప్రైమరీ లెవల్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ లెవల్గా పరిగణిస్తారు. ఎస్జీటీ పోస్టులు అధికంగా గుంటూరు జిల్లా పరిధిలో 151 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కర్నూలు జిల్లా పరిధిలో 130 పోస్టులు ఉన్నాయి.
| జిల్లా | ఎస్జీటీ పోస్టులు | స్కూల్ అసిస్టెంట్ పోస్టులు |
| అనంతపురం | 101 | 100 |
| చిత్తూరు | 117 | 82 |
| తూర్పుగోదావరి | 127 | 151 |
| గుంటూరు | 151 | 98 |
| వైఎస్ఆర్ కడప | 57 | 49 |
| కృష్ణా | 71 | 89 |
| కర్నూలు | 110 | 130 |
| శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 63 | 44 |
| ప్రకాశం | 74 | 50 |
| శ్రీకాకుళం | 71 | 109 |
| విశాఖపట్నం | 59 | 52 |
| విజయనగరం | 45 | 66 |
| పశ్చిమ గోదావరి | 90 | 105 |
విద్యాహక్కుల పునరుద్ధరణ లక్ష్యం.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికే అని చెప్పవచ్చు. విద్యారంగంలో అసమానతలు తొలగించి, సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ఖాళీలను భర్తీచేయడం ద్వారా.. విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ప్రభుత్వం ఆశిస్తోంది.ల ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.
నియామక ప్రక్రియ ఇలా..స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామాకాలను సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం కానుంది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు.. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.