AP DSC 2024 New Schdule: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్షల(TRT-DSC)ను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ ‌కుమార్ మార్చి 9న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)కు డీఎస్సీ-2024కి మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షెడ్యూలు మార్చారు. కొత్త షెడ్యూలు ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్(SGT) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(PGT), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో షెడ్యూలును ప్రభుత్వం మార్చింది.

ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూలు..

విషయం ముఖ్యమైన తేదీలు
పరీక్ష కేంద్రాల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు 20.03.2024 నుంచి.
డీఎస్సీ-2024 పరీక్ష హాల్‌టికెట్ల విడుదల 25.03.2024 నుంచి.
SGT పోస్టులకు పరీక్షలు 30.03.2024 నుంచి 03.04.2024 వరకు.
GT, PGT, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు 07.04.2024.
స్కూల్ అసిస్టెంట్(SA), టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు 13.04.2024 నుంచి 30.04.2024 వరకు.

టెట్, డీఎస్సీ పరీక్షలపై హైకోర్టు ఏందంటే?
ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. మార్చ్ 15 వ తేది నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14 వ తేదీన వస్తున్నాయని, మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్ లో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై జవ్వాజి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాదుల వాదనలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..