తెలంగాణలో 'గ్రూప్‌-2' పరీక్ష వాయిదా వేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆగస్టు 9, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్‌-2ను రీషెడ్యూల్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు. 


ఒకే నెలలో రెండు పరీక్షలు..
గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ - 2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రూప్-2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


గ్రూప్-2 పరీక్షలో ఎకానమీ పేపర్‌లో అదనపు సిలబస్‌పై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకనామీకి సంబంధించిన ఒకే బుక్ ప్రభుత్వం విడుదల చేసిందని అభ్యర్థులు తెలిపారు. వారంలోనే గ్రూప్-2, లెక్చరర్, గురుకులాల పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. మేము రూ.3 వేల నిరుద్యోగ భృతి అడగట్లే.. మూన్నెళ్ల గడువు కోరుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గ్రూప్‌-2 వాయిదాపై టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన..
గ్రూప్‌ 2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల డిమాండ్‌లను పరిశీలిస్తామని తెలిపారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వినతిపత్రం తీసుకున్నామని అందులో తెలిపారు. వారి విన్నపాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతానికి గ్రూప్-2 పరీక్ష వాయిదా పడలేదని స్పష్టం చేశారు అనిత రామచంద్రన్. దీనిపై టీఎస్‌పీఎస్‌సీ స్పష్టమైన ప్రకటన చేస్తుందని అంత వరకు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు సూచించారు. 


భారీ ర్యాలీగా కదిలిన అభ్యర్థులు.. 
నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయం నుంచి సుమారు రెండు వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్‌-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు.