ఒక మనిషి జీవిత కాలపరిమితి వందేళ్లు. కానీ ఆ వందేళ్లు నిండుగా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది? చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో మధ్యలోనే అకాల మరణం చెందుతున్నారు. ఎక్కువ కాలం జీవించాలి అనుకునే వాళ్ళకి ఒక అధ్యయనం దారి చూపిస్తోంది. ఎవరైతే ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటారో,  అందులోనూ నీళ్లు ఎక్కువగా తాగుతారో, వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు ఆ అధ్యయనం నిరూపించింది. నీళ్లు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు చాలా తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు తేలింది. అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఎక్కువ నీళ్లు తాగే వారు ఆరోగ్యంగా జీవిస్తున్నట్టు తేలింది. ఈ పరిశోధనలో భాగంగా వాళ్ళు 30 ఏళ్లపాటూ 11,255 మంది పెద్దల ఆరోగ్య డేటాను విశ్లేషించారు. వాళ్ళు రోజులో ఎంత నీరు తాగుతున్నారు? ఎంత ద్రవపదార్థాలు తీసుకుంటున్నారు? అనే దానిపై పరిశోధన సాగించారు. ద్రవపదార్థాలు తీసుకునేటప్పుడు ప్లాస్మాలో సోడియం స్థాయిలను వాళ్ళు విశ్లేషించారు. ప్లాస్మాలో సోడియం స్థాయిలను బట్టి ఆ వ్యక్తి దీర్ఘకాలం జీవించే అవకాశాలు ఆధారపడి ఉన్నట్టు తేలింది. ఎవరి ప్లాస్మాలో అయితే సోడియం స్థాయిలో తక్కువగా ఉంటాయో వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టు ఈ అధ్యయనకర్తలు చెప్తున్నారు. ప్లాస్మా సోడియం స్థాయిలు ఎక్కువగా ఉన్న పెద్దల్లో గుండె ఆగిపోవడం, స్ట్రోక్ రావడం, ధమని వ్యాధులు రావడం, మానసిక సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. 


ఎంత తాగాలి?
అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మహిళలు ప్రతిరోజూ ఆరు నుంచి తొమ్మిది గ్లాసుల నీటిని తాగాలి. అదే పురుషులు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి. కానీ ప్రపంచంలో సగం మంది తాగాల్సిన నీటి కన్నా తక్కువగానే తాగుతున్నట్టు చెబుతున్నారు పరిశోధకులు. ఎక్కువ మంది ఆరు గ్లాసుల నీటికి పరిమితమవుతున్నట్టు చెబుతున్నారు. ఇది ఆరోగ్యం పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. శరీరంలో నీళ్లు తగ్గడం అనేది ప్లాస్మాలో సోడియంను పెంచే అత్యంత ప్రమాదమైన కారకమని అంటున్నారు. ఎవరైతే అధికంగా నీటిని తాగుతారో వారి శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీని వల్ల వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలా ఎక్కువకాలం జీవించే అవకాశం పెరుగుతుంది. కాబట్టి రోజూ పుష్కలంగా నీళ్లు తాగండి, ఎక్కువ కాలం జీవించండి. 


నిద్ర లేచిన వెంటనే...
ఒక మనిషి 7 నుంచి 9 గంటల పాటూ నిద్రపోతాడు. ఆ సమయంలో నీళ్లు తాగడు. దీని వల్ల డీ హైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర లేచిన వెంటనే గ్లాసు నీళ్లు తాగేయాలి. దాహం వేసినా, వేయకపోయినా ఇది కచ్చితంగా పాటాంచాలి. డీ హైడ్రేషన్ సమస్య వల్ల తలనొప్పి పెరిగిపోతుంది. ఎలాంటి కారణం లేకుండా తలనొప్పి వస్తుందంటే దానికి డీ హైడ్రేషన్ కారణమని తెలుసుకోవాలి. మైగ్రేన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ విషయంపైనా ఏకాగ్రత లేకుండా చేస్తుంది డీ హైడ్రేషన్. ఉదయాన్నే నీరు తాగడం వల్ల బరువు కూడా తగ్గచ్చు. 


Also read: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? వాటిని సహజంగా బయటికి పంపించే డ్రింక్స్ ఇవే


































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.