దేశంలోనే మూడో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్లను ఎంఎన్ జే ఆస్పత్రిలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ థియేటర్ ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.... 34 కోట్ల వ్యయంతో రోబోటిక్ సర్జరీ థియేటర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ద్వారా ఎంతోమంది రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. ఇక క్యాన్సర్ తో ఆవాసన దశలో బాధపడుతున్న వారి కోసం పాలేటివ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అవసరమైన వారికి ఇంటి వద్ద పాలేటి సేవలు అందిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.


ఈ రోబోటిక్ థియేటర్ ద్వారా ఎంతోమంది రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎన్ జే ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. 370 మంది క్యాన్సర్ ఉన్న మహిళలను ఈ ఆస్పత్రిలో చేర్పించామని వివరించారు. క్యాన్సర్ కు చికిత్స అందించడంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉందని చెప్పారు.


900 కోట్లు విడుదల చేశాం...
క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు 900 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఆరోగ్య మహిళల్లో మహిళలకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఈ ఆస్పత్రిలో మూడు థియేటర్లు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. అవి కూడా 60 సంవత్సరాల క్రితం ప్రారంభించినవని అన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఎంఎన్ జే ఆస్పత్రిని అభివృద్ధి చేసే ఆలోచన చేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసేందుకు 120 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.


గత పాలకులు తెలంగాణ వైద్య, ఆరోగ్యం కోసం నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని. ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సదుపాయాలు, సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. 


ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి వరకు ఇప్పటికే అన్ని సౌకర్యాలను కల్పించుకొని వైద్యరంగంలో తెలంగాణ దేశంలో ముందుందని చెప్పారు. రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు, పల్లె దవఖానాలు, కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు. ప్రజల చింతకే వైద్యం వెళ్లేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.


" రోజులు గడుస్తున్న కొద్ది కొత్త కొత్త క్యాన్సర్లతో బాధపడుతున్న రోగులు పెరుగుతున్నారు. అందువల్ల దీనికి అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి చేయాలి. అధునాతన సౌకర్యాలు అందించేందుకు ఎంఎస్ జే ఆసుపత్రికి 120 కోట్లు కేటాయించాం. ఈ నిధులతో రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల ప్రత్యేక వైద్యశాలగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో భాగంగా 34 కోట్లతో రోబోటిక్ పరికరాలను ప్రారంభించాం" అని మంత్రి హరీష్ రావు చెప్పారు.