ప్రతి రోజూ తగినన్నినీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. నీళ్లు ఒకటే కాదు మంచి ఆహారం తీసుకోకపోవడం కూడా రాళ్లు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వాటి పని తీరు సరిగ్గా ఉంటేనే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. సున్నితంగా ఉండే వాటిని కాపాడుకోవాలంటే తగినన్ని నీళ్లు తాగడమే కాకుండా, సరైనా పోషకాహారాన్ని తీసుకోవాలి. అయితే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు? కిడ్నీల్లో రాళ్లను వంటింటి చిట్కాలతో ఎలా కరిగించవచ్చు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కిడ్నీల్లో రాళ్లు కరిగించే వంటింటి చిట్కాలు
* ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో సగం నిమ్మకాయను పిండుకుని తాగితే, రాళ్లను సులభంగా కరిగించవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఇలా తాగడం మరింత ప్రయోజనకరం.
* రణపాల మొక్క ఆకు, కాస్త చక్కెర కలిపి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. తద్వారా స్టోన్స్‌ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
* యాలకుల్లోని గింజలను పొడిగా చేసి, ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ పొడిని కలపండి. స్పూన్ చక్కెర, కొన్ని పుచ్చకాయ గింజలను ఆ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని తాగండి. కొన్నిరోజుల పాటు ఇలా చేస్తే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
* ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగి తినండి. అలాగే ఉదయం ఎక్కువగా నీళ్లు తాగండి. కొన్ని రోజులు ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను పిండుకుని.. అందులో కొద్దిగా ఆలివ్ నూనెను కలపండి. ఇక ఆ నీటిని తాగండి. కొద్దిరోజులు ఇలా చేయడం వల్ల మీరు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
* ఆపిల్ వెనిగర్‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి సహాయపడుతుంది. రోజూ వెచ్చని నీటితో రెండు టీస్పూన్ల వెనిగర్ తీసుకోవడం వల్ల సమస్యకు దూరం కావచ్చు. 
* మరోవైపు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఉప్పు తక్కువ ఉన్న కూరలను తినాలి. అలాగే మాంసం తీసుకోవడం తగ్గించాలి. చాక్లెట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తగ్గించాలి.


లక్షణాలు: 


* కిడ్నీలో రాళ్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడ‌మ భాగంలో నొప్పి వ‌స్తుంటుంది. లేదంటే ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడ‌మ వైపు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పోటు ఉన్నట్లు ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించాలి. ఒకవేళ కిడ్నీలో స్టోన్లు ఉంటే.. ఆ మేర‌కు చికిత్స తీసుకుని రాళ్లను తొల‌గించుకోవాలి.


* మూత్రం విసర్జించే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.


* వాంతి వ‌చ్చిన‌ట్లు ఉండ‌టం, వికారం, వ‌ణ‌ుకు, జ్వరం వంటి ల‌క్షణాలు ఉంటే... కిడ్నీలో రాళ్లు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. 


ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.