స్త్రీలకు పీరియడ్స్ చాలా ముఖ్యమైనవి. అవి సకాలంలో రావడం శరీర ఆరోగ్యాన్ని సూచిస్తుంది. కానీ కొందరిలో పీరియడ్స్ మిస్ అవుతూ ఉంటాయి. ఆ విషయాన్ని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు, కానీ ఇలా పీరియడ్స్ మిస్ అవ్వడం అనేది ఎన్నో అనారోగ్యాలకు సూచన కావచ్చు. ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా పీరియడ్స్ రావడం సర్వసాధారణం. కానీ ఒక నెల వచ్చి ఇంకో నెల రాకపోవడం లాంటివి జరిగితే మాత్రం సీరియస్ గా తీసుకోవాలి. గర్భం ధరించడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. అలాగే కొన్ని రకాల సమస్యల కారణంగా కూడా పీరియడ్స్ రావు. కారణమేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ఋతుచక్రం 21 నుంచి 30 రోజుల వరకు లెక్కిస్తారు. అంటే నెలసరి పూర్తయ్యాక 21 రోజులు తర్వాత మళ్లీ నెలసరి రావచ్చు. కొందరిలో 21 రోజులకే వస్తే, మరికొందరిలో 30 రోజులకు వస్తుంది. 21 రోజులు కన్నా ముందే నెలసరి వస్తే త్వరగా వస్తున్నట్టు లెక్క. 30 రోజులు దాటినా కూడా ఇంకా నెలసరి రాకపోతే పీరియడ్స్ ఆలస్యం అవుతున్నట్టు లెక్క. ప్రతి స్త్రీ రుతు చక్రం ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ ఒకేలా రావాలని లేదు.


పీరియడ్స్ లేట్ అవ్వడానికి కారణాలు
గర్భవతుల్లో పీరియడ్స్ ఆగిపోతాయి. టెస్ట్ చేయించుకుంటే గర్భవతో కాదో తెలిసిపోతుంది. ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ లేట్ అవ్వడం, ఆగిపోవడం వంటివి  జరుగుతూ ఉంటాయి.


ఒత్తిడి
ఎక్కువ కాలం పాటు ఒత్తిడికి గురవుతున్న వారిలోనూ రుతు చక్రం దెబ్బతింటుంది. ఒత్తిడి ఋతుచక్రాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి కారణంగా క్రమరహిత పీరియడ్స్ లేదా లేట్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కడుపునొప్పి, పొత్తికడుపు దగ్గర తిమ్మిరిగా అనిపించడం వంటివి కూడా జరుగుతాయి. వైద్యులు చెబుతున్న ప్రకారం ఒత్తిడి రాకుండా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం వంటివి పాటించాలి. ఆరోగ్యకరమైన తాజా ఆహారం తినాలి. 


బరువు తగ్గడం
శారీరక వ్యాయామాల వల్ల లేదా ఆహారం సరిగా తినకపోవడం వల్ల బరువు తగ్గిపోతే కూడా పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆహారంలో మార్పుల వల్ల అండోత్సర్గము, ఋతుక్రమం ఆగిపోవడం లేదా ఆలస్యం కావడం జరుగుతుంది. పునరుత్పత్తి హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా పీరియడ్స్ మిస్ అవుతాయి. మీ శరీర పనితీరును ప్రభావితం చేసే ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.


గర్భనిరోధక మాత్రలు
చాలామంది మహిళలు గర్భనిరోధక పద్ధతులను పాటిస్తారు. అందులో గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో పీరియడ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మాత్రలు శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ల లో తీవ్ర మార్పులకు కారణం అవుతాయి. కాబట్టి వీటి వల్ల కూడా రుతుక్రమం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 


పిసిఓఎస్
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పిసిఓఎస్ అనేది మహిళల్లో వచ్చే సమస్య. హార్వర్డ్ హెల్త్ చెబుతున్న ప్రకారం పిసిఓఎస్ ఉన్న చాలామంది ఆండ్రోజెన్ హార్మోన్ ను కలిగి ఉంటారు. దీనివల్ల అండాశయాలపై చిన్న గాలి తిత్తులు ఏర్పడతాయి. వాటి వల్ల జుట్టు అధికంగా పెరగడం, మొటిమలు, పిల్లలు పుట్టకపోవడం, అధిక బరువు పెరగడం, క్రమరహిత రుతుక్రమం వంటివి కలుగుతాయి. కాబట్టి పీరియడ్స్ మిస్ అయితే పిసిఓఎస్ సమస్య ఉందేమో చెక్ చేయించుకోవడం ఉత్తమం.


ఊబకాయం
అధిక బరువు వల్ల కూడా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అధిక బరువు వల్ల మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థను నియంత్రించే హార్మోన్ అయినా ఈస్ట్రోజన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పీరియడ్స్ మిస్ అవ్వడం, ఆలస్యంగా రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. 



Also read: డయాబెటిస్ ఉన్నవారు చెరుకు తినవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.