H5N1 flu confirmed in Chennai:  తమిళనాడు రాజధాని చెన్నైలో హెచ్5ఎన్1  బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవల చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పక్షులు అకస్మాత్తుగా మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమై నమూనాలను సేకరించారు. భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబొరేటరీకి పంపిన ఈ నమూనాల్లో ప్రాణాంతక హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ స పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో  ముందుజాగ్రత్తలు చేపట్టడంతో పాటు, ఐదు కిలోమీటర్ల పరిధిని నిఘా జోన్‌గా ప్రకటించారు.                           

Continues below advertisement

హెచ్5ఎన్1 అనేది ప్రధానంగా పక్షులలో వచ్చే అత్యంత వేగంగా వ్యాపించే ఇన్‌ఫ్లుయెంజా వైరస్. ఇది సాధారణంగా అడవి పక్షులు, వలస పక్షుల ద్వారా పెంపుడు కోళ్లు, బాతులకు సోకుతుంది. సోకిన పక్షుల లాలాజలం, మలం లేదా శ్వాసకోశ స్రావాల ద్వారా ఈ వైరస్ ఇతర పక్షులకు వ్యాపిస్తుంది. పౌల్ట్రీ రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. బాధితులుగా ఉన్న పక్షుల్లో మరణాల రేటు దాదాపు 90 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఈ వైరస్ తీవ్రతను తెలియజేస్తుంది.                          

మనుషులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్నపై ఆరోగ్య నిపుణులు  భిన్నంగా స్పందిస్తున్నారు.  సాధారణంగా ఈ వైరస్ మనుషులకు సోకడం అరుదు అని చెబుతున్నారు. అయితే, సోకిన పక్షులతో నేరుగా సంబంధం ఉన్నవారికి లేదా కలుషితమైన పౌల్ట్రీ పరిసరాల్లో ఉండేవారికి ఇది సోకే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఇది తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు  దారితీస్తుంది. ప్రస్తుతం ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపించే సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ, వైరస్ మ్యూటేషన్ చెందితే  భవిష్యత్తులో మహమ్మారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరిస్తోంది.                          

Continues below advertisement

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయాందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించి తీసుకోవాలని, చనిపోయిన పక్షులను చేతులతో తాకవద్దని హెచ్చరిస్తున్నారు. జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అధికారులు ఇప్పటికే మాంసం దుకాణాలపై నిఘా పెంచారు.