కొంతమంది ఆఫీసులో ఉన్నా, ఏదైనా వేడుకల్లో ఉన్నా... చుట్టు పదిమంది ఉన్నారని దగ్గు వస్తుంటే ఆపకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఎంత ఆపినా దగ్గు ఆగదు, తన్నుకొని వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆపడం ప్రమాదకరం. స్వేచ్ఛగా దగ్గడమే ముఖ్యం. అలా దగ్గడం వల్ల మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. దగ్గు అనేది ఊపిరిత్యులకు సంబంధించిన అనారోగ్యాన్ని సూచిస్తుంది. అలాగే గొంతులో ఉన్న ఇబ్బందులను కూడా సూచిస్తుంది. ఆ ఇబ్బందులను బయటికి పంపించే ప్రయత్నంలోనే మనం దగ్గుతాం. దగ్గకుండా అణచివేయడం వల్ల సమస్య పెరుగుతుంది కానీ తరగదు.  


దగ్గినప్పుడు మన శ్వాసనాళాల్లో ఉండే గాలి అత్యంత వేగంగా బయటికి వస్తుంది. దీంతో ఊపిరితిత్తుల్లో ఉన్న కొన్ని స్రావాలు కూడా ఆ దగ్గుతోపాటు బయటికి వచ్చేస్తాయి. అలాగే గొంతులో అడ్డుపడుతున్న కఫం కూడా బయటికి వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి దగ్గు వచ్చినప్పుడు ఆపుకోకూడదు. బయటికి వెళ్లి కాసేపు దగ్గి రావడం మంచిది. దగ్గకపోతే అవాంఛిత స్రావాలు లోపలే ఉండిపోతాయి. కాబట్టి దగ్గడం ద్వారా వాటిని బయటికి పంపించవచ్చు. 


అలాగే దగ్గు కొన్ని రోగాలకు లక్షణంగా కూడా చెప్పుకుంటారు. అందుకే ఎప్పుడూ దగ్గును తక్కువ అంచనా వేయకూడదు. రెండు రోజులకు మించి దగ్గు వేధిస్తున్నప్పుడు కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వాడాలి. లేకుంటే గొంతు ప్రాంతంలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దగ్గు ఎందుకు వస్తుందో తెలుసుకొని ఆ సమస్యకు మందు వాడాను మందులు వాడడం ద్వారా ఆటోమేటిగ్గా దగ్గును తగ్గించుకోవచ్.చు అంతే తప్ప దగ్గడం మానేసి దాన్ని అణిచివేయడం ద్వారా దగ్గును ఆపుతామనుకోవడం భ్రమే. 


దగ్గు వచ్చాక రెండు రోజులు ఓపికగా చూడాలి. ఇంకా తగ్గకపోతే అప్పుడు వైద్యులను సంప్రదించాలి. సాధారణ బ్యాక్టీరియా వల్ల దగ్గు వచ్చి ఉంటే ఇంట్లోని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా దాన్ని పోగొట్టుకోవచ్చు. అలా కాకుండా వ్యాధుల కారణంగా దగ్గు వస్తే మాత్రం అది సాధారణ చిట్కాలకు తగ్గదు. వైద్యులను సంప్రదించాల్సిందే


ఇంటి చిట్కాలు
సాధారణ దగ్గు అయితే ఆవిరి పట్టడం ద్వారా గొంతులో ముక్కులో ఉన్న బ్యాక్టీరియా, క్రిములను చంపేయవచ్చు. అలాగే వేడి నీటిలో తేనె కలుపుకొని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఉసిరికాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ తింటే దగ్గు, జలుబు లాంటివి దాడి చేయవు. వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే గొంతుకు చాలా మంచిది. దగ్గు కూడా పోతుంది. దగ్గు వస్తున్నప్పుడు వేపుళ్ళు, స్పైసి ఫుడ్ కు దూరంగా ఉండాలి. నాన్ వెజ్ కూడా తినకపోవడమే మంచిది. ఉడకపెట్టిన గుడ్లు, పండ్లు, ఆకుకూరలు వంటివి తింటే దగ్గు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం దగ్గును తగ్గించే మహత్తు కరక్కాయలో నిండుగా ఉంది. దీన్ని బుగ్గలో పెట్టుకొని నములుతూ, దీని నుంచి వచ్చే చేదు రసాన్ని మింగితే దగ్గు రెండు మూడు రోజుల్లో సులువుగా తగ్గిపోతుంది. 


Also read: ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల కంటిచూపుకే కాదు - చర్మం, జుట్టుకూ నష్టమే