Salt In Summer | శరీరానికి అన్ని రకాల లవణాలు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ ఒక్కటి తగ్గినా అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అందుకే, అన్నీ సమపాళ్లలో ఉండాలి. ఇక ఉప్పు విషయానికి వస్తే.. ఇందులో శరీరానికి మేలు చేసే సోడియం ఉంటుంది. అయితే, ఇది మోతాదు మించితే మాత్రం తిప్పలు తప్పవు. కాబట్టి, ఉప్పును తక్కువ తీసుకుంటేనే మంచిది. కానీ, వేసవిలో మాత్రం దీని లెక్క వేరే ఉంటుందట. మీరు తీవ్రమైన ఉక్కపోత, వేడి కలిగిన ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే.. సందర్భాన్ని బట్టి ఉప్పును తీసుకోవాలని సూచిస్తున్నారు. 


వైద్యులు, డైటీషియన్ల సిఫార్సు ప్రకారం.. పెద్దలు రోజుకు 2,300 మిల్లీ గ్రాముల ఉప్పును తీసుకోవాలి. అంతేకంటే ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అయితే, ఉప్పును ఎక్కువగా తీసుకొనే సందర్భాలు వేరే ఉంటాయి. ఏ సమయంలో ఎంత ఉప్పు తీసుకోవాలనే విషయాన్ని ఇటీవల కొన్ని ఫిట్‌నెస్ యాప్‌లు కూడా చెప్పేస్తున్నాయి. అయితే, మీకు డయాబెటీస్, గుండె, రక్త సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే.. ఉప్పుతో ముప్పు కొనితెచ్చుకోవద్దు. వైద్యుల సూచన ప్రకారమే డైట్ పాటించాలి. 


ఉప్పు మోతాదును ఏయే సందర్భాల్లో పెంచాలి?: తక్కువ శరీరక శ్రమ, సాధారణ వాతావరణాల్లో నివసించే ప్రజలు నిర్దేశిత ఉప్పును తింటే చాలు. మరీ తగ్గించినా.. సోడియం స్థాయిలు తగ్గిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా వ్యాయామం చేసే క్రీడాకారులకు కొన్నిసార్లు సోడియం బూస్ట్ అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, నిర్దేశిత మొత్తం కంటే ఎక్కువ ఉప్పును శరీరానికి అందించాలి. లేకపోతే అది ‘హైపోనట్రేమియా’ (Hyponatremia) ఏర్పడవచ్చు. శరీరంలో సోడియం తగ్గినప్పుడు మైకం, గందరగోళం ఏర్పడుతుంది. బాగా బలహీనంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది మరణానికి కూడా దారితీయొచ్చు. 


డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు ఉప్పు తీసుకోవాలా?: అతిగా శ్రమించినప్పుడో, వ్యాయమం చేస్తున్నప్పుడో చెమటల ద్వారా సోడియం బయటకు పోతుంది. ఫలితంగా ‘హైపోనాట్రేమియా’ ఏర్పడవచ్చు. ఆ సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు కూడా గురవ్వుతుంది. అలాంటి సందర్భంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. కాస్త ఉప్పు నీరు లేదా ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరం కోల్పోయిన సోడియంను భర్తీ చేయొచ్చని చెబుతున్నారు. అయితే, ఇది వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. 


వేసవిలో వేడి వాతావరణంలో..: వాతావరణ పరిస్థితులు కూడా మీకు బాగా చెమటలు పట్టేలా చేస్తాయి. వేసవిలో మాత్రమే కాకుండా వర్షాకాలంలో కూడా ఉక్కపోత తీవ్రమై చెమటలు బాగా పట్టే అవకాశం ఉంటుంది. ఫలితంగా తలనొప్పి, తీవ్రమైన దాహం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ఉప్పు చల్లిన ఆహారాన్ని లైట్‌గా తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో చెమట, మూత్రం వల్ల కోల్పోయే సోడియంను తిరిగి పొందాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. 


మూత్ర పిండాల వ్యాధి ఏర్పడుతుందా?: శరీరం సోడియంను కోల్పోయినప్పుడు ‘నెప్రోపతీ’ (nephropathy) అనే మూత్రపిండాల వ్యాధి ఏర్పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఏర్పడితే మీ శరీరానికి తగిన సోడియాన్ని అందించే ప్రక్రియ కష్టతరంగా మారుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రతినిధి, జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మెడిసిన్ ప్రొఫెసర్ అయిన లారెన్స్ అప్పెల్ ఓ మీడియా సంస్థకు చెప్పారు. ‘‘ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు వారి మూత్రంలో అదనపు సోడియంను కోల్పోతారు. సోడియం స్థాయిలను తగినంతగా పెంచుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే అది ‘హైపోనాట్రేమియా’కు కూడా దారితీయొచ్చు. మైకం, తలనొప్పి, బలహీనత లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 


‘ఉప్పు’ విషయంలో సొంత నిర్ణయాలు వద్దు: శరీరంలో సోడియం తగ్గిపోవడానికి వివిధ ఔషదాలు, మూత్ర విసర్జన సమస్యలు కూడా కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఖనిజ అసమతుల్యత ఏర్పడినప్పుడు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే, బీపీ ఉన్నవారికి ఉప్పు చాలా ప్రమాదకరం. కాబట్టి, ఉప్పు విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుడి సలహా తప్పకుండా తీసుకోవాలి. అయితే, వేసవిలో తీవ్రమైన ఉక్కపోత, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, శరీరం కోల్పోయే నీటిని, సోడియంను తిరిగి ఇవ్వాలని అంటున్నారు. వేసవిలో తగినంత నీటిని తాగడం ద్వారా కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. బాగా నీరసంగా ఉన్నప్పుడు ఉప్పు కలిపిన నిమ్మసోడా తాగడం మంచిదే. 


Also Read: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!


వాదనలూ ఉన్నాయ్: ఈ అధ్యయనంపై పలు వాదనలు కూడా ఉన్నాయి. చెమట పట్టినప్పుడు శరీరం నుంచి నీరు మాత్రమే ఎక్కువగా బయటకు పోతుందని, ఉప్పు చాలా తక్కువగా పోతుందని అంటున్నారు. పైగా, అతిగా ఉప్పును తీసుకోవడం ఎప్పటికీ మంచిది కాదని అంటున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఉప్పును తీసుకోవాలని తెలుపుతున్నారు. ఉప్పు వల్ల హైపర్‌టెన్షన్, బీపీ సమస్యలు వస్తాయని, ఎట్టి పరిస్థితుల్లో దాని మోతాదును పెంచకూడదని సూచిస్తున్నారు. వేసవిలో నీరు మాత్రమే అవసరం. డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో సోడియం గాఢత పెరుగుతుంది. ఆ సమయంలో మరింత ఉప్పు తీసుకుంటే.. ఆ అదనపు ఉప్పును తొలగించడానికి మూత్రపిండాలు ఎక్కువ నీటిని విసర్జించేలా చేస్తాయి. అది పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తుందని అంటున్నారు. 


Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి


గమనిక: వివిధ అధ్యయనాలు, పరిశోధనలు, వైద్య నిపుణులు తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించవని గమనించగలరు.