దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. కొత్త కేసులు 30వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. దాదాపు నాలుగు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో క్షీణించాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. మరణాల సంఖ్య కూడా 400 సమీపానికి దిగివచ్చిందని పేర్కొంది. 



  1. తాజాగా 17,20,110 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..29,689 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.14కోట్లకు చేరాయి. 

  2. నిన్న మరో 415 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 4,21,382 మంది మహమ్మారికి బలయ్యారు. 

  3. ఇక నిన్న 42,363 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా..మొత్తంమీద 3.06కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.39 శాతంగా ఉంది. 

  4. క్రియాశీల కేసులు 4లక్షల దిగువకు క్షీణించాయి. ప్రస్తుతం 3,98,100 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.27 శాతానికి తగ్గింది.


  5. తాజాగా 66,03,112 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. దాంతో టీకా డోసుల పంపిణీ 44 కోట్ల మార్కును దాటింది.   




దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 40వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.





భారత్‌లో ఇప్పటికే మూడింట రెండు వంతుల జనాభాలో యాంటీబాడీలు ఉన్నాయని సీరమ్ సర్వేలో వెల్లడైన విషయంపై డా.గులేరియా స్పందించారు. ఇప్పటికీ ఒక వంతు జనాభా వైరస్ రిస్క్‌ను ఎదుర్కొంటోందన్న విషయాన్ని ప్రస్తావించారు. యాంటీబాడీలకు సంబంధించి రెండు అంశాలను పేర్కొన్నారు. ఒకటి... శరీరంలో 'X' స్థాయిలో యాంటీబాడీలు ఉంటే రీఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటారని చెప్పేందుకు ఎటువంటి అవకాశం లేదన్నారు. రెండవది... వైరస్ బారినపడి కోలుకున్నవారిలో క్రమంగా యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతుందన్నారు. అయితే వ్యాక్సినేషన్ పెరగడం మంచి పరిణామని... థర్డ్ వేవ్ మరీ అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని అన్నారు.




ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాచించకుండా లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు లైట్ తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ ప్రమాదకరంగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. కనుక ప్రజలు నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.