సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన దృశ్యకావ్యం 'శాకుంతలం' (Shakuntalam). దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. శకుంతల పాత్రలో సమంత కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆమెకు జోడీగా దుశ్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ (Dev Mohan) నటించారు. మరి, ఈ సినిమాలో విలన్ రోల్ ఎవరు చేస్తున్నారు? కింగ్ అసుర పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అంటే... కబీర్ సింగ్ (Kabir Duhan Singh In Shakuntalam).


గోపీచంద్ 'జిల్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కబీర్ సింగ్ విల‌న్‌గా ఇంట్ర‌డ్యూస్‌ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. అయితే...  సమంత 'శాకుంతలం'లో చేసిన కింగ్ అసుర పాత్ర తన కెరీర్‌లో మైలురాయి అని అతడు అంటున్నాడు. కబీర్ సింగ్ మార్షల్ ఆర్ట్స్ పెర్ఫార్మన్స్ చూసి గుణశేఖర్ అతడికి లుక్ టెస్ట్ చేశారట. ఆ తర్వాత అసుర పాత్రకు ఫైనలైజ్ చేశారు.


'శాకుంతలం' సినిమాలో తనకు, దుశ్యంతుడి పాత్ర చేసిన దేవ్ మోహన్‌కు మధ్య భారీ యుద్ధ సన్నివేశం ఉందని, పది రోజుల పాటు ఆ వార్ సీక్వెన్స్ తీశారని కబీర్ సింగ్ తెలిపారు. ఆ యుద్ధ సన్నివేశాల్లో 18 కిలోల కిరీటం ధరించానని, ఇంకా ఛాతిపై ధరించిన రక్షణ కవచం కూడా ఒరిజినల్ కావడంతో చాలా బరువుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాలతో పోలిస్తే... 'శాకుంతలం'లో తన నటన, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటుందని కబీర్ సింగ్ చెప్పుకొచ్చారు.


ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ (Neelima Guna) 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ (Allu Arha) కూడా నటించారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.