నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వస్తున్న ప్రతీ సారి ఏదొక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో ఆయన నోటికి నియంత్రణ ఉండడం లేదు. ఎంత మాటొస్తే అంత మాట అనేస్తున్నారు. గత నెలలో ఆయన పుట్టినరోజు నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ప్లస్ లు, మైనస్ లు ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ను సంబంధం లేని విషయంలోకి లాగి ఆయన్ని తక్కువ చేస్తూ మాట్లాడారు. 



'ఆదిత్య 369' సినిమా విడుదలైన ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇళయరాజా సంగీతం గురించి మాట్లాడారు బాలయ్య. ఇళయరాజా గొప్పతనం గురించి చెబుతూ.. సంగీత దర్శకులకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందని చెప్పిన బాలయ్య సడెన్ గా రెహ్మాన్ పేరెత్తారు. అంతటితో ఆగకుండా.. రెహ్మాన్ ఎవరో తనకు తెలియదని అన్నారు. పదేళ్లకు ఒక హిట్ ఇస్తాడని.. ఏదో ఆస్కార్ అవార్డు వస్తుందంటూ సంబంధం లేని మాటలు మాట్లాడారు.  ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో రెహ్మాన్ ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. 



అసలు ఈ బాలకృష్ణ ఎవరు అంటూ.. who is balakrishna అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు రెహ్మాన్ ఫ్యాన్స్. రెహ్మాన్ అంటే ఎవరో తెలియకుండానే నువ్ నటించిన 'నిప్పురవ్వ' సినిమాకి ఆయనతో కలిసి పని చేశావా..? అంటూ బాలయ్యను ప్రశ్నిస్తున్నారు. ఇది చూసిన బాలయ్య అభిమానులు ఆయనకు మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు. క్యాన్సర్ పేషంట్స్ కోసం ఆయన చేస్తోన్న సేవల గురించి, తోటి నటీనటులతో బాలయ్య మెలిగే తీరు గురించి కామెంట్స్ పెడుతున్నారు. 



దీంతో రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ట్విట్టర్ లో వీటిపై మీమ్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. బాలయ్యపై ఎంత నెగెటివిటీ వచ్చినా.. ఆయన పట్టించుకోరని.. ఆయనకు ఆ అవసరం లేదంటూ ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య 'అఖండ' సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు భారీ విజయాలను అడ్డుకోవడంతో 'అఖండ'పై అంచనాలు పెరిగిపోయాయి.