Aadi Purush : ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon) జంటగా నటించిన 'ఆది పురుష్ (Adi Purush)' ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. చిన జీయర్ స్వామి స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుకలో ప్రభాస్ గురించి కృతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన గురించి అందరూ అనుకుంటున్నది నిజం కాదని చెప్పారు.


బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యంత పేరు, ప్రఖ్యాతలు, ప్రశంసలు పొందిన నటుల్లో కృతి సనన్ ఒకరు. పాపులర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న ఆమె.. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనూ ఎంతో పేరును సంపాదించుకుంది. తెలుగులో ‘1 నేనొక్కడినే’ సినిమాతో అరంగేట్రం చేసిన కృతి.. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ కోసం జతకట్టింది. ఈ చిత్రంలో, ప్రభాస్ రాఘవ పాత్రను పోషించగా, కృతి జానకి పాత్రకు జీవం పోశారు.


ఇటీవల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గ్రౌండ్స్ లో ఆది పురుష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో కృతి సనన్ ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. “జై శ్రీ రామ్” నినాదంతో స్పీచ్ ప్రారంభించిన ఆమె.. తమకు మద్దతు తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రభాస్ అభిమానులకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. 


"తెలుగు చిత్ర పరిశ్రమలో నా కెరీర్‌ని ప్రారంభించిన తొమ్మిదేళ్ల తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాతో మళ్లీ మీ అందరి ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నేను పోషించిన జానకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీ అచంచలమైన ప్రేమ, ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది” అని కృతి సనన్ చెప్పుకొచ్చారు. “కొన్నిసార్లు మనం సినిమాలను ఎంచుకోవడం కాదు, కొన్ని సినిమాలు మనల్ని ఎంచుకుంటాయి. ఈ కథ చెప్పడానికి జానకి (జానకి పాత్రను సూచిస్తూ) నన్ను ఎంచుకున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇది ఒక అపురూపమైన ఆశీర్వాదం. ఈ సినిమా విజయం సాధించి, ఎప్పటికీ నిలిచిపోయే హిట్‌గా నిలవాలని మీ ఆశీస్సులు కోరుతున్నాం” అని అన్నారు.


ఈ సందర్భంగా కృతి.. ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకుంది, “ప్రభాస్ మాట్లాడడు అని నాకు చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి అతను చాలా మాట్లాడతాడు. అతను చాలా కష్టపడి పనిచేస్తాడు, వెరీ స్వీట్. అంతే కాదు ప్రభాస్ పెద్ద ఫుడీ కూడా. ఆయన కళ్లలోని ప్రశాంతత, స్వచ్ఛత శ్రీరాముడి గుణాలకు ప్రతిబింబమని నేను భావిస్తున్నాను. శ్రీరాముడి పాత్రను ప్రభాస్‌ కంటే మెరుగ్గా మరెవరూ పోషించగలేరు" అని కృతి సనన్ వ్యాఖ్యానించారు.


'ఆదిపురుష్' చిత్రాన్ని ఈ నెల 16న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కృతి,  ప్రభాస్‌లతో పాటు సన్నీ సింగ్, దేవదత్త నాగే, సైఫ్ అలీ ఖాన్, ఇతర ప్రతిభావంతులైన నటులు కూడా నటించారు.


Read Also : టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్