సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కలిసి నటించిన తాజా సినిమా ‘పుష్ప - ది రైజ్’.  గత ఏడాది డిసెంబరులో విడుదలైన ఈ సినిమా ఓ రేంజిలో విజయాన్ని అందుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లోనూ హిట్ అయ్యింది. కలెక్షన్లలోనూ కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని దర్శకుడు సుకుమార్ ముందే ప్రకటించారు. అనుకున్నట్లుగా ఫస్ట్ పార్ట్ ‘ఫుష్ప-ది రైజ్’ అద్భుత విజయం అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ పనులు మొదలయ్యాయి.

   


పుష్ప సీక్వెల్ అప్ డేట్ కోసం అభిమానుల నిరసన


తొలిపార్ట్ విజయంతో మంచి జోష్ మీదున్న సుకుమార్, బన్నీ సీక్వెల్ మూవీపై ఫోకస్ చేశారు. కొద్ది రోజుల కిందటే ఈ సినిమా సెట్స్ మీదకు రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. బన్నీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాడు. రాగానే సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్ నడిచింది. బన్నీ అమెరికా నుంచి వచ్చి నెల రోజులు దాటినా పుష్ప సీక్వెల్ పై ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలోనే అభిమానులు నిరసనలు మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పుష్ప సీక్వెల్ ‘పుష్ప- ది రూల్’  అప్‌ డేట్ ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. తాజాగా హైదరాబాద్‌ గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు బన్నీ అభిమానులు నిరసన కార్యక్రమం చేపట్టారు.పెద్ద సంఖ్యలో గుమిగూడి పుష్ప సీక్వెల్ అప్ డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.






గీతా ఆర్ట్స్ ముందు ఆందోళన, సోషల్ మీడియాలో ట్రోలింగ్


ఈ నెల మొదట్లోనే సినిమా షూటింగ్ మొదలవుతుందని సినిమా యూనిట్ చెప్పినా.. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వాస్తవానికి ఈ ఏడాదిలోనే ‘పుష్ప-2’ విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాలతో సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు. వెంటనే సినిమా అప్ డేట్ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు నిరసన బాటపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ లోనూ  సినిమా అప్ డేట్ కోసం ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో అభిమానులు ఆందోళనకు దిగడం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. పుష్ప-2 సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందుకు కాకుండా, గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఫ్యాన్స్ ఆందోళన చేయడంపై ట్రోలింగ్ నడుస్తోంది.        


ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన పుష్ప


అటు తాజాగా జరిగిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ‘పుష్ప’ సినిమా ఓ రేంజ్‌లో సత్తా చాటింది. మొత్తం 7 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హోదాను అందుకున్నాడు. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.  


Read Aslo: సదా వేదాంతం - అలాంటి మనుషులు, వారి స్నేహాలు పోతేపోనీయ్ అంటున్న ముద్దుగుమ్మ!