విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న సినిమా 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో.. ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూడు పదుల వయసు వచ్చినా... పెళ్లి కాని ఓ అబ్బాయి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. 


ప్రస్తుతం పెళ్లి కాని అబ్బాయిల ఇబ్బందులు ఏమిటి..? అమ్మాయిల ఆలోచన ఏ విధంగా ఉందనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారట. 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేశారు. ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 






ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, టీజర్ ను విడుదల చేశారు. యూత్ ని టార్గెట్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన విశ్వక్ సేన్ 2017లో 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తరువాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేశాడు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2019లో 'ఫలక్‌నుమాదాస్' చిత్రంతో దర్శకుడిగా, రచయితగా, సహా నిర్మాతగా కూడా మారాడు. ఆ సినిమాలో హీరో కూడా అతనే. ఆ మూవీ విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపు తెచ్చింది. తరువాత వచ్చిన 'హిట్' సినిమా హిట్టు కొట్టడంతో హీరోగా నిలబడ్డాడు విశ్వక్. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.