Ram Gopal Varma met Vijay Sethupathi: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమిళ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారా? కథ కూడా వినిపించారా? త్వరలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమా సెట్స్ మీదకు రాబోతుందా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం వినిపిస్తోంది. తాజాగా వర్మ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని కలిసిన నేపథ్యంలో ఈ ప్రశ్నలకు బలం చేకూరుతోంది. తాజాగా చెన్నైకి వెళ్లిన రామ్ గోపాల్ వర్మ, విజయ్ సేతుపతిని ఆయన ఆఫీస్ లో కలిశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఏదో అంశంపై ఇద్దరూ సీరియస్ గా చర్చిస్తున్నట్లు అర్థం అవుతోంది.


రియల్ లైఫ్ లో ఇంకా బెటర్ గా ఉన్నారు- ఆర్జీవీ


విజయ్ తో సమావేశానికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ పై ప్రశంసలు కురిపించారు. అతడు సినిమాల కంటే నిజ జీవితంలో ఇంకా బాగున్నారంటూ కామెంట్ చేశారు. “సినిమాల్లో అత‌డి న‌ట‌నను చాలాసార్లు చూశాను. చివరకు అత‌డిని క‌లుసుకున్నాను. విజ‌య్ సినిమాల్లో కంటే రియల్ లైఫ్‌లో ఇంకా బెట‌ర్ గా ఉన్నాడు” అంటూ వర్మ రాసుకొచ్చారు.   


ఆర్జీవీ, విజయ్ సేతుపతిని ఎందుకు కలిశారు?


ప్రస్తుతం ఆర్జీవీ, విజయ్ సేతుపతి మీటింగ్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎవరినీ పని లేకుండా కలవని వర్మ... నేరుగా చెన్నైకి వెళ్లి విజయ్ సేతుపతిని కలిశారంటే ఏదో పెద్ద విషయమే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ తో కలిసి వర్మ సినిమా ప్లాన్ చేస్తున్నారేమో? అనే చర్చ జరుగుతోంది. సినిమా అనే ఎందుకు అనుకోవాలి? ఇంకా ఏదైనా ఈవెంట్ కోసం కలిసి ఉండవచ్చు కదా? అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇది అనుకోకుండా జరిగిన మీటింగ్ కావచ్చని ఇంకొందరు చెప్తున్నారు. వీరిద్దరు ఏ సందర్భంలో కలవాల్సి వచ్చింది? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.   


వివాదాస్పద అంశాలతో ఆర్జీవీ సినిమాలు


వాస్తవానికి రామ్ గోపాల్ గత కొంత కాలంగా తీస్తున్న సినిమాలన్నీ వివాదాస్పద అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, వర్మ వివాదాస్పదం అయ్యే కథలనే తన సినిమాలకు ఎంచుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయాలే అయినా, కొత్త పాయింట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయ్ సేతుపతిని కలవడం వెనుక కొత్త సినిమా ప్లానే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.






వరుస సినిమాలతో విజయ్ బిజీ బిజీ


ఇక విజయ్ సేతుపతి చివరగా ‘మెర్రీ క్రిస్మస్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఫీమేల్ లీడ్ గా నటించింది. ప్రస్తుతం వెట్రి మారన్ తో కలిసి  ‘విడుదలై పార్ట్ 2’ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు 'గాంధీ టాక్స్',  'మహారాజా' అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Read Also: ఐదు రోజుల్లో 50 కోట్లు కలెక్ట్ చేసింది - అంతలో పైరసీ చేసేశారని సలార్ నటుడు పృథ్వీరాజ్ ఆవేదన