రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు పాన్ ఇండియా లెవల్‌లో మార్కెట్ ఉంది. దానికి 'లైగర్'కు వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్స్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సినిమా విడుదలకు ముందు చాలా హైప్ నెలకొంది. కానీ రిజల్ట్ మాత్రం ఆ స్థాయిలో రాలేదు. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది 'లైగర్'. సినిమాకు మొదటి రోజు తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ బలంగా వినిపించింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ చేసినా... శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడినా ఏదీ కలిసి రాలేదు. 


'లైగర్' పరాజయానికి కారణాలు ఏమైనా... ఆ ప్రభావం పూరి-విజయ్ నెక్స్ట్ సినిమా 'జనగణమణ' మీద పడింది. ఆ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టేశారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. 'లైగర్' రిలీజ్ కు ముందే ఈ సినిమాను మొదలుపెట్టారు. పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకొని ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలొస్తున్నాయి. కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. 


తాజాగా 'సైమా' అవార్డ్స్ కి హాజరయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మీడియా అతడిని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు విజయ్ దేవరకొండ. సైమా గురించి మాట్లాడి ఈవెంట్ ని ఎంజాయ్ చేయాలని కోరారు. విజయ్ ఏం చెప్పకుండా సమాధానం దాటేయడంతో సందేహాలు కలుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా క్యాన్సిల్ అయి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. 


ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవే 'ఖుషి', 'జనగణమన'. 'ఖుషి' సినిమా కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 


కశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 


దిల్ రాజుతో విజయ్ దేవరకొండ సినిమా:


నిర్మాత దిల్ రాజు విజయ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. అప్పటినుంచి ఈ బ్యానర్ లో ఓ సినిమా బాకీ ఉండిపోయారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు దిల్ రాజుతో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో విజయ్ కి మంచి కథను సెట్ చేసే పనిలో పడ్డారు దిల్ రాజు.


అశ్వనీదత్ తో మరో సినిమా:


అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సౌత్ లో కూడా పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్ కి నచ్చింది. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు వెళ్లింది. ఆయనకు కూడా నచ్చడంతో.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.


Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!


Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్