హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మాస్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్.. తర్వాత ‘గీతా గోవిందం’ లాంటి క్యూట్ లవ్ స్టోరీల సినిమాల్లోనూ నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్ తో అందర్నీ ఆకట్టుకుంటాడు విజయ్. ఈ యంగ్ హీరోకు లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే. విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యాన్స్ కు అదిరిపోయే బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చాడు. తన అభిమానుల్లో ఓ 100 మందిని ఉచితంగా కులుమనాలి ట్రిప్ కు తీసుకువెళ్తానని ప్రకటించాడు. తన సొంత ఖర్చుతోనే ఈ ట్రిప్ కు తీసుకెళ్లనున్నట్లు తెలిపాడు విజయ్. 


విజయ్ ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు అప్డేడ్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ‘దేవరశాంటా’ పేరుతో అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ లు ఇస్తూ వస్తున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 100 మంది తన అభిమానుల్ని ఉచితంగా ట్రిప్ కు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతే కాదు ఈ ట్రిప్ లో ఎక్కడికి వెళ్లాలో కూడా ఫ్యాన్స్ నే డిసైడ్ చేయమని చెప్తూ ఓ నాలుగు ఆప్షన్ లు ఇచ్చాడు. అందులో  మౌంటెన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే చాలా మంది అభిమానులు మౌంటెన్స్ ఆఫ్ ఇండియాకు ఓటింగ్ చేయడంతో ఓ 100 మందిని ఉచితంగా కులుమనాలి తీసుకెళ్తామంటూ ఓ వీడియో ను విడుదల చేశాడు విజయ్. 


 



ఎక్కువ మంది మౌంటెన్స్ ట్రిప్ కు ఓటేశారు కాబట్టి కులుమనాలి పంపిస్తానన్నాడు విజయ్. ఈ ట్రిప్ ఐదు రోజులు ఉంటుందని, ఈ ట్రిప్ లో పర్వతాలు, ఆలయాలు, సందర్శించదగ్గ ప్రదేశాలకు తీసుకెళ్తారని చెప్పాడు. అలాగే మరెన్నో యాక్టివిటీస్ కు ప్లాన్ చేశానని కూడా తెలిపాడు. అయితే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే అర్హులని తెలిపాడు. ట్రిప్ కు రావాలి అనుకునే వారు ట్విట్టర్ పోస్ట్ లో ఉన్న దేవరశాంటా లింక్ ఓపెన్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పాడు. ఈ ట్రిప్ లో తాను కూడా అభిమానుల వెంట వస్తానని ప్రకటించాడు విజయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తమ అభిమాన హీరోతో ట్రిప్ వెళ్లడం కోసం అభిమానులంతా వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. మరి ఇంత మందిలో విజయ్ తో ట్రిప్ కు చెక్కేసే ఆ వంద మంది ఎవరో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ చివరిగా ‘లైగర్’ సినిమాలో నటించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేశారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత విజయ్ తన తర్వాత ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ తో ట్రిప్ ను ప్లాన్ చేశాడు.