నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా రూపొందుతోన్న ఫ్యాక్షన్ సినిమా 'వీర సింహా రెడ్డి'. సంక్రాంతి బరిలో దిగడమే లక్ష్యంగా చిత్ర బృందం పని చేస్తోంది. తొలుత డిసెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... చిత్రీకరణ అనుకున్న విధంగా కంప్లీట్ కాలేదు. అందుకని, సంక్రాంతికి వెళ్ళారు. ఈ రోజు సినిమా విడుదల తేదీ వెల్లడించారు. 


జనవరి 12న 'వీర సింహా రెడ్డి'
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'వీర సింహా రెడ్డి' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. ముందు నుంచి ఈ తేదీకి సినిమా వస్తుందనేది తెలిసిందే. కాకపోతే ఈ రోజు అధికారికంగా వెల్లడించారు.
 
విజయ్ 'వారసుడు' vs 'వీర సింహా రెడ్డి'
సంక్రాంతి బరిలో తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతోన్న 'వారసుడు' వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు తెలుగు రాష్ట్రలో థియేటర్లను విజయ్, బాలకృష్ణ పంచుకోవాలి. వీళ్ళిద్దరూ వచ్చిన మరుసటి రోజు... జనవరి 13న 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ థియేటర్లలోకి రానున్నారు. మూడు సినిమాలకు ఎటువంటి ఓపెనింగ్స్ లభిస్తాయో? అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 


'అఖండ' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నుంచి వస్తున్న సినిమా కావడంతో 'వీర సింహా రెడ్డి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా 'క్రాక్' విజయంతో మంచి హుషారుగా సినిమా తీస్తున్నారు.






అటు టర్కీ... ఇటు అనంతపురం!
ఫ్యాక్షన్ నేపథ్యంలో 'వీర సింహా రెడ్డి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ అంటే ప్రేక్షకులకు, ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది రాయలసీమ. ఆ సీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో కొంత షూటింగ్ చేశారు. అంతకు ముందు టర్కీలో కూడా షూటింగ్ చేశారు. బాలకృష్ణ, శృతి హాసన్ మీద టర్కీలో తీసిన సీన్లు అందరినీ అలరిస్తాయని టాక్. అక్కడ తీసిన ఫైట్ అయితే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందట. 


Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?



వాస్తవ ఘటనల ఆధారంగా 'వీర సింహా రెడ్డి'
ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ. 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అలాగే, 'సింహా' టైటిల్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 'వీర సింహా రెడ్డి'లో కూడా సింహా ఉంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. టైటిల్ సెంటిమెంట్ మాత్రమే కాదు... సినిమాలో అద్భుతమైన కంటెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.  


హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.