తెలుగు చిత్రసీమలో రెబల్ స్టార్ ఎవరంటే? అందరూ చెప్పే పేరు కృష్ణం రాజు (Krishnam Raju). ఆయన నట వారసుడిగా ప్రభాస్ (Prabhas) చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. పెదనాన్న కంటే మించిన స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు. గతేడాది కృష్ణం రాజు ఈ లోకం విడిచి వెళ్ళారు. ఆయన్ను 'అన్‌స్టాపబుల్‌ 2'లో నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. 


పెదనాన్నకు రుణపడి ఉన్నాం
ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా వచ్చిన 'అన్‌స్టాపబుల్‌ 2 - బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 1 డిసెంబర్ 29న స్ట్రీమింగ్ అయ్యింది. అందులో తన మొహమాటం సిగ్గు గురించి మాట్లాడుతూ పెదనాన్నను ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. తనకు తండ్రి లక్షణాలు వచ్చాయని, పెదనాన్నలా బిగ్గరగా మాట్లాడే అలవాటు రాలేదన్నారు. ఆయన మరణం తర్వాత మొగల్తూరు వచ్చిన అభిమాన సంద్రానికి ఏర్పాటు చేసిన భోజనాల గురించి చెప్పారు. అయితే... కృష్ణంరాజు చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏం జరిగిందనేది రెండో పార్టులో చూపించనున్నారు. 


''ఇవాళ మేం ఇలా ఉన్నామంటే పెదనాన్నగారి వల్లే. ఆయనకు మేం రుణపడి ఉన్నాం. ఆ రోజుల్లో మద్రాస్ వెళ్లి పది, పన్నెండేళ్ళు విలన్ రోల్స్ చేశారు. ఆ తర్వాత సొంత బ్యానర్ స్టార్ట్ చేసి మహిళా ప్రాధాన్య చిత్రాలతో చరిత్ర సృష్టించారు. మా కుటుంబం అంతా పెదనాన్నను మిస్ అవుతోంది'' అని ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు.  


ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారు
పెదనాన్న (కృష్ణం రాజు) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో నెల రోజులు ఉన్నారని ప్రభాస్ తెలిపారు. అప్పుడు తానూ ఆసుపత్రిలో ఉన్నానని, నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరిపానని ఆయన చెప్పారు. డాక్టర్స్‌తో టచ్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించారు.
 
కంట్రోల్ చేసుకోలేకపోయా - బాలకృష్ణ
కృష్ణం రాజు మరణించిన సమయంలో బాలకృష్ణ టర్కీలో ఉన్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'వీర సింహా రెడ్డి' చిత్రీకరణలో ఉండటంతో ఇండియా రాలేకపోయారు. ఆ విషయాన్ని గుర్తు చేసిన బాలకృష్ణ ''నాకు విషయం తెలియగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏడుపు వచ్చేసింది'' అని చెప్పారు. షోలో కృష్ణంరాజుకు నివాళి అర్పించినట్లు తెలిసింది.  


Also Read : అమెరికాలో 'వీర సింహా రెడ్డి' దూకుడు - ఫస్ట్ డే 8 కోట్లు గ్యారెంటీ!?


ప్రభాస్‌తో పాటు గోపీచంద్ కూడా జనవరి 6న స్ట్రీమింగ్ కానున్న 'అన్‌స్టాపబుల్‌ 2 -  ద బాహుబలి' ఎపిసోడ్ పార్ట్ 2లో సందడి చేయనున్నారు. అందులో ఎమోషనల్ మూమెంట్స్ మాత్రమే కాదు, సరదా సంభాషణలు కూడా ఉన్నాయి. ప్రభాస్, గోపీచంద్ హీరోయిన్ కోసం గొడవ పడ్డారని అడగటం 'నేనేమీ గొడవ పడలేదు. నువ్వు పడితే చెప్పేయ్' అని ప్రభాస్ అనడం ఆల్రెడీ విడుదలైన ప్రోమోలో చూపించారు. అందువల్ల, మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
 
ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు ప్రభాస్ అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు యాప్ ఓపెన్ చేయడంతో 'ఆహా' కాసేపు పని చేయలేదు. ఈసారి అటువంటి సమస్య ఉండకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫస్ట్ పార్టులో ప్రభాస్ పెళ్లి టాపిక్, పులులు దత్తత తీసుకోవడం వంటి విషయాలు ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేశాయి. 


Also Read : ఇక్కడ నాగ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'