Vasanth Ravi about Pon Ondru Kanden TV Premiere: కోవిడ్ సమయంలో ఓటీటీ అనేది ప్రేక్షకులకు సినిమాలు దూరం అవ్వకుండా చేసింది. నేరుగా సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మేకర్స్‌కు కూడా లాభాలు వస్తున్నాయని కొన్నిరోజల పాటు వారంతా అదే రూటును ఫాలో అయిపోయారు. అందుకే ఇప్పుడు ఒక సినిమా విడుదల అవ్వాలంటే థియేటర్ ఆప్షన్ లేకపోతే ఓటీటీ ఉందిగా అనే ఆలోచనకు వచ్చేశారు మేకర్స్. కానీ తాజాగా ఒక తమిళ చిత్రం మాత్రం అటు థియేటర్ కాకుండా, ఇటు ఓటీటీ కాకుండా ఏకంగా టీవీలో ప్రసారం అవ్వడానికి సిద్ధమయ్యింది. దీనికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతుండగా.. ఇందులో నటించిన హీరో మాత్రం మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.


ఫ్యాన్స్‌కు షాక్..


అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించిన చిత్రమే ‘పొన్ ఒండ్రు కండేన్’. యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు థియేటర్లలో విడుదల అవ్వలేదు. అయితే థియేటర్లలో కాకపోతే ఓటీటీలో విడుదల అవుతుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయంలోనే కలర్స్ తమిళ్ ఛానెల్ ఒక ప్రోమోను విడుదల చేసింది. త్వరలోనే ‘పొన్ ఒండ్రు కండేన్’ చిత్రాన్ని ప్రసారం చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వ్యూయర్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అశోక్ సెల్వన్‌కు ఉన్న క్రేజ్‌తో తన సినిమాలు థియేటర్లలో విడుదలయినా మినిమమ్ గ్యారెంటీ హిట్ అవుతాయని ఫ్యాన్స్ నమ్ముతారు. అలాంటిది తన మూవీ నేరుగా టీవీలో రావడమేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వసంత్ రవి ఈ విషయంపై స్పందించాడు.


నిర్మాణ సంస్థపై ఆగ్రహం..


‘షాకింగ్‌గా ఉంది. అసలు ఇది నిజమేనా? జియో స్టూడియోస్ లాంటి ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఇలా చేస్తుందని అనుకోలేదు. ‘పొన్ ఒండ్రు కండేన్’ వరల్డ్ శాటిలైట్ ప్రీమియర్ గురించి ప్రకటన, ప్రోమో చూడడం చాలా బాధాకరంగా అనిపించింది. ఈ ప్రీమియర్ గురించి సినిమాలో పనిచేసిన ఏ ఒక్కరికీ కూడా సమాచారం అందలేదు. మేము ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. జియో స్టూడియోస్‌కు థ్యాంక్యూ. మీపై గౌరవం మరింత పెరిగిపోయింది’ అంటూ జియో స్టూడియోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు వసంత్ రవి. ‘ఒక ఆర్టిస్ట్.. నిర్మాతకు కట్టుబడి ఉన్న తర్వాత కమర్షియల్ నిర్ణయాలలో అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉండదు. కానీ సినిమాకు సంబంధించిన విషయాలు తెలుసుకునే మర్యాద ఇస్తే బాగుంటుంది’ అంటూ వాపోయాడు. 






ప్రీమియర్స్ ఎప్పుడంటే.?


‘పొన్ ఒండ్రు కండేన్’ చిత్రం చాలాకాలం షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్నోసార్లు విడుదల చేయాలని నిర్ణయించుకున్నా కూడా పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. ఒక్కసారిగా మార్చి 24 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కలర్స్ తమిళ ఛానెల్‌లో ఈ మూవీ ప్రీమియర్ అవుతుంది అంటూ వచ్చిన ప్రోమోను ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. అందుకే ఫ్యాన్స్ తరపున, ప్రేక్షకుల తరపున వసంత్ రవి స్పందించడానికి ముందుకొచ్చాడు. ఇది మూవీ టీమ్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం అయితే ప్రేక్షకులు ఖండించడానికి వీలు ఉండదని కానీ నిర్మాణ సంస్థ మాత్రమే ఎవరికీ తెలియకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అశోక్ సెల్వన్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రియా వీ కామాక్షి డైరెక్షన్‌లో ‘పొన్ ఒండ్రు కండేన్’ తెరకెక్కింది.


Also Read: ‘హాయ్ నాన్న’ భామతో ఆనంద్ దేవరకొండ జోడీ - ఫస్ట్ లుక్ రిలీజ్