హైదరాబాద్ లో ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్నేహితుల ఇంట్లో పూజ ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. కుమార్తె ఎంతకీ ఇంటికి రాకవపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


స్నేహితుల ఇంట్లో పూజ అని చెప్పి..


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రహమతుల్లా నగర్ లో సంతోషి, నీలకంఠ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె చదువు మానేసి కుంటుంబానికి సాయం చేస్తోంది. అప్పుడప్పుడు సీరియల్ షూటింగ్ లకు కూడా వెళ్తుండేది. ఈ క్రమంలోనే ఈ నెల 12 న ఇంట్లో తన తల్లి లేకపోవడంతో స్నేహితురాలి ఇంట్లో పూజ జరుగుతుంది వెళ్లాలి అని తన సోదరుడుకి చెప్పి బయటకు వెళ్లింది. సాయంత్ర 7 గంటల ప్రాంతంలో తల్లి సంతోషి ఆమె ఫోన్ కు ఫోన్ చేయగా దగ్గర్లో ఉన్నాను వస్తున్నానని చెప్పింది ఆ యువతి. అయితే కుమార్తె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో మళ్లీ సంతోషి యువతికి ఫోన్ చేసింది. ఎన్ని సార్లు చేసినా ఫోన్ కలవలేదు. ఆ రాత్రంతా ఎదురు చూసినా కుమార్తె మాత్రం ఇంటికి రాలేదు. 


పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు..


రాత్రి గడిచినా కుమార్తె ఆచూకీ దొరక్కపోవడంతో తర్వాత రోజు ఉదయం బంధువులు, స్నేహితులను విచారించారు. అయినా ప్రయోజనం లేదు. దీంతో మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సదరు యువతి కుటుంబ సభ్యులు. ఆమె వయసు దాదాపు 16 ఏళ్లు ఉంటాయని, సుమారు 5 అడుగుల ఎత్తు ఉంటుందని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. యువతి ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఎర్ర రంగు డ్రెస్, తెలుపు చున్నీ ధరించిందని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించరు. 


Also Read: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: బెడిసికొట్టిన ప్లాన్- మాళవికని తీసుకెళ్లిపోయిన వసంత్, వేదనే వెళ్లగొట్టిందని అనుకున్న యష్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial