Nagababu Re Entry To Jabardasth Comedy Show: అతి పెద్ద టీవీ కామెడీ షో 'జబర్దస్త్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పేరు వింటేనే ఆడియన్స్ ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ షో తాజాగా 700 ఎపిసోడ్స్‌తో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది.

గత దశాబ్ద కాలంగా 'జబర్దస్త్' షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. నాగబాబు, రోజా ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు. ఈ షో ద్వారా ఎంతోమంది టాప్ కమెడియన్స్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమ కామెడీ టైమింగ్, పంచులు, స్కిట్లతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సత్య, గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, షకలక శంకర్, ధన్ రాజ్ ఇలా ఎంతో మంది ఈ షో ద్వారా పరిచయమై సినీ పరిశ్రమలో తమ టాలెంట్‌తో మంచి స్థాయిలో ఉన్నారు.

నాగబాబు రీ ఎంట్రీ

700 ఎపిసోడ్స్‌తో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'జబర్దస్త్' షో నిర్వాహకులు స్పెషల్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో మెగా బ్రదర్, యాక్టర్ నాగబాబు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 'రావాల్సిన వాళ్లు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ... ఆశ్చర్యపోతున్నారేంట్రా కుయ్యా... మనల్నెవడ్రా ఆపేది.' అంటూ ఆయన చెప్పడం హైప్ క్రియేట్ అవుతోంది. అయితే... ఈయన సెలబ్రేషన్స్‌కు ఆయన అతిథిగా వచ్చారా?, మళ్లీ జడ్జీగా కొనసాగుతారా? అనే దానిపై క్లారిటీ లేదు. ఆయన జడ్జీగా కొనసాగితేనే బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఫిష్ వెంకట్‌కు మరో హీరో ఆర్థిక సాయం - ఫ్యామిలీకి రూ.2 లక్షల చెక్ అందజేత

స్పెషల్ జడ్జెస్ వీరే...

'జబర్దస్త్' షో కామెడీ స్కిట్స్ ఎంత స్పెషలో జడ్జెస్ కూడా అంతే ఫేమస్. మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా ఈ షోకు ఎన్నో ఏళ్లుగా జడ్జెస్‌గా వ్యవహరిస్తూ వన్నె తీసుకొచ్చారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో రోజాకు మంత్రి పదవి రావడంతో షోకు గుడ్ బై చెప్పారు. నాగబాబు సైతం పొలిటికల్‌గా బిజీగా మారడంతో జడ్జి బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత ఈ షోకు ఖుష్బూ, ఇంద్రజ, కృష్ణ భగవాన్, సింగర్ మను జడ్జెస్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం శుక్ర, శనివారాల్లో రాత్రి 9:30 గంటలకు షో టెలికాస్ట్ అవుతుండగా... ఇంద్రజ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. 

మళ్లీ ఇన్నాళ్లకు నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ ఫ్యాన్స్‌తో పాటు షో కమెడియన్స్‌లోనూ జోష్ నెలకొంది. ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్లు ఒకరికొకరు పాదాలు కడిగి సన్మానం చేయడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

కనిపించని రోజా

ఈ సెలబ్రేషన్స్‌లో రోజా కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. నాగబాబు ఉన్నారనే రాలేదా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం నాగబాబు జనసేన ఎమ్మెల్సీగా ఉన్నారు. రోజా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. దీంతో నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదా? లేదా ఆమెనే రానని చెప్పారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.