Lakshimi Raave Maa Intiki Serial Today Episode: కుటుంబం మొత్తాన్ని తీసుకుని సూర్యనారాయణ గెస్ట్హౌస్కు బయలుదేరివెళ్లడంతో ప్రియంవద గుండెల్లో గుబులు పుడుతుంది. అక్కడే దాచి ఉంచిన తన భర్త గుట్టు బయటపడుతుందేమోనని భయపడి చస్తుంది. కారు ఆగడంతో చకచకా దిగి ఇంటిలోపలికి పరుగులు తీస్తుంది. ప్రియంవద ఎందుకు అలా పరుగెడుతుందని వాళ్ల అమ్మ ఇందిరా అడగ్గా. ...వాష్రూమ్కు వెళ్తుందేమోనని సింధూ చెబుతుంది. వెంటనే లోపలికి వెళ్లిన ప్రియంవద రౌడీలను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశిస్తుంది. వెంటనే లోపలికి వెళ్లిపోయి తన భర్తను దాచి ఉంచిన గదిలోకి వెళ్తుంది. అతన్ని ఎలా దాచిపెట్టాలో తెలియక చాలా కంగారుపడుతుంది.ఇంతలో సూర్యనారాయణతోపాటు అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు.ఇక అతన్ని బయటకు తీసుకెళ్లడం కుదరదని తెలుసుకున్న ప్రియంవద కట్టిపడేసిన భర్తను దుప్పటితో ముసుగుకట్టి కర్టెన్ వెనక దాచిపెడుతుంది. హమ్మయ్యా ఇప్పటికైతే బతికిపోయాను అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇంట్లోకి వచ్చిన అందరినీ ఎవరి గదుల్లోకి వారు వెళ్లి ప్రెష్ అవ్వమని సూర్యనారాణ అంటాడు. దీంతో అందరూ తమతమ గదుల్లోకి వెళ్లిపోతారు.మరి నేను ఏ గదిలో ఉండాలని శ్రీలక్ష్మీ అడుగుతుంది. ఆ ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్లమని ఇక నుంచి ఆ గది నీదేనని అంటాడు. ఇంతకు ముందు ఆగది మా ఇద్దరిదని...ఇప్పటి నుంచి నీదని చెబుతాడు. మ్యాడీ తన గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా...సూర్యనారాయణ తిట్టి నీకు పెళ్లయ్యిందని నువ్వు కూడా లక్ష్మీ గదిలోనే ఉండాలన్న సంగతి మర్చిపోయావా అని గద్దిస్తాడు. దీంతో చేసేదిలేక శ్రీలక్ష్మీని తీసుకుని వాళ్ల తాతయ్య చూపించిన గదిలోకి నడుస్తాడు. అప్పటికే ఆ గదిలో తన భర్తను దాచిపెట్టిన ప్రియంవద...లక్ష్మీ, మ్యాడీని చూసి కంగారుపడుతుంది. ఎక్కడికి వస్తున్నారని అడగ్గా....పెద్దయ్య ఈ గది మాకు ఇచ్చారని లక్ష్మీ చెబుతుంది. ఆల్రెడీ ఈ గది నేను తీసుకున్నానని మీరు వేరే గది తీసుకోమని చెబుతుంది. మీ ముఖాన ఆ చెమటలు ఏంటని లక్ష్మీ అడగ్గా...ఈ గదిలో ఏసీ పనిచేయడం లేదని అందుకే చెమటలు పడుతున్నాయన ప్రియంవద చెబుతుంది. అయితే మీరు మంచి ఏసీ ఉన్న గదిలోకి వెళ్లండని...నేను, మ్యాడీ ఈగదిలో ఉంటామని చెబుతుంది.అవసరం లేదని..ఈ గదని నాకు చాలా కంఫర్ట్గా ఉందని మీరే వేరే గదిలోకి వెళ్లండని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. సాయంత్రం అందరూ సరదాగా బయట కూర్చుని ఉంటారు.కానీ ప్రియంవదకు మాత్రం నిప్పుల కుంపటిపై కూర్చున్నట్లు ఉంటుంది. ఏ నిమిషంలో భర్తకు తెలివి వస్తుందేమోనని భయపడిపోతుంది. వీళ్లను ఎలా అడ్డుకోవాలని ఆలోచిస్తుంది. ఇంతలో సూర్యనారాయణ అందరం సరదాగా గడపడానికి వచ్చాం కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని కూతురు ప్రియంవదను అడుగుతాడు.అసలే టెన్షన్లో ఉన్న ప్రియంవదకు ఏం చెప్పాలో తెలియదు. మ్యూజికల్ ఛైర్ ఆడదామని చెబుతుంది. అయితే నువ్వే జడ్జిగా ఉండి ఈ ఆటలన్నీ ఆడించాలని సూర్యనారాయణ చెబుతాడు.అందరూ కలిసి మ్యూజికల్ ఛైర్ అడుతుంటారు. చివరకు లక్ష్మీ, మ్యాడీ మిగులుతారు. అయితే సడెన్గా లక్ష్మీ ఒడిలో మ్యాడీ కూర్చుంటాడు. నేనే గెలిచానని వాదిస్తాడు.అయితే సూర్యనారాయణ కూతురిని ఎవరు గెలిచారని అడగ్గా...శ్రీలక్ష్మీ గెలిచినట్లు ప్రియంవద ప్రకటిస్తుంది. మరోవైపు తెలివిలోకి వచ్చిన ప్రియంవద భర్త తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మ్యూజికల్ ఛైర్ తర్వాత అందరూ కలిసి మరో ఆట ఆడతారు.
