Jagadhatri Serial Today Episode: నిషిక,యువరాజు తీవ్రంగా అవమానించడంతోశ్రీవల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ఆస్పత్రి పైకి ఎక్కుతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన జగధాత్రి, కేదార్‌ శ్రీవల్లిని రక్షిస్తారు. ఎందుకు ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నావని నిలదీస్తారు. నా కన్నతల్లే నన్ను ఆసహ్యించుకుంటోందని...నిన్నటి వరకు చెల్లిలా చూసిన యువరాజు కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలని శ్రీవల్లి అంటుంది. అంటే నిన్ను చెల్లిలా భావిస్తున్న నాకోసం బతకలేవా అని కేదార్ అడుగుతాడు. 
 
ఆ మాటలకు చలించిపోయిన శ్రీవల్లి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయనని వాళ్లకు మాటిస్తుంది. దీంతో ఆమెను తీసుకుని కిందకు వస్తారు. తనను చూడటానికి వచ్చిన యువరాజు, నిషిక, సుధాకర్‌, కౌషికిని చూసిన వైజయంతి...హమ్మయ్యా నేను చచ్చిపోతానని బెదిరించే సరికి వాళ్లకు ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లు ఉన్నారని వైజయంతి సంతోషిస్తుంది. కౌషికి, యువరాజు  ఇలాంటి పని ఎందుకు చేశావని వైజయంతిని నిలదీస్తారు. నేను వద్దంటున్నా ఆ శ్రీవల్లిని ఇంట్లోకి తీసుకొచ్చారని...పెళ్లిచేసి పంపిస్తానని చెప్పినా చెడగొట్టారని..ఇప్పడుు దత్తత తీసుకుంటుంటే మాత్రం ఏం చేయనని అందుకే చచ్చిపోవాలనుకున్నానని అంటుంది.
 
వాళ్లు మాట్లాడుకుంటుండగానే శ్రీవల్లి, ధాత్రి, కేదార్ అక్కడికి వస్తారు. వాళ్లను చూసిన వైజయంతి కోపంతో రగిలిపోతుంది. ఈ అమ్మిని ఇంకా ఇంట్లో నుంచి పంపించలేదా అని వైజయంతి అడుగుతుంది. ఇంత జరిగినా సిగ్గులేకుండా దాన్ని మళ్లీ ఎందుకు తీసుకొచ్చారని నిషిక ధాత్రిని అడుగుతుంది. ఉన్నఫళంగా  వెళ్లిపొమ్మంటే ఆడపిల్ల ఎక్కడికి పోతుందని కేదార్ అంటాడు. ఆ అమ్మి ఎక్కడికి పోతుందో నాకు తెలియదని తను ఉన్న ఇంట్లో నేను ఉండనని వైజయంతి అంటుంది. 
 
మా అమ్మ అ ఇంట్లో ఉండాలంటే శ్రీవల్లి అక్కడ ఉండకూడదని యువరాజు అంటాడు. అప్పటి వరకు సహనంతో ఉన్న సుధాకర్‌ అయితే నువ్వు,నీ భార్య మీ అమ్మను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోండని సుధాకర్‌ అంటాడు. ఆ మాటలకు ముగ్గురు షాక్‌ తింటారు. ఏంటి మామయ్య అలా అంటున్నారని నిషిక అనగా...నేను చెప్పింది నిజమే కదమ్మా...మీరు ఉండలేనప్పుడు వేరే ఇంటికి వెళ్లిపోండని అన్నాను అంటాడు.అదేంటి అత్తయ్యకు మాటిచ్చారు కదా అని నిషిక అనగా...నేను దత్తతు తీసుకోనని మాటిచ్చానే గానీ, శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేస్తానని మాటివ్వలేదని అంటాడు.ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనని అంటాడు. ఇక్కడ గొడవలు ఎందుకని...ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని కౌషికి అంటుంది.
 
ఇంటికి వెళ్లిపోయిన తర్వాత యువరాజు, నిషిక ప్రవర్తన గురించే ధాత్రి ఆలోచిస్తుంటుంది. అసలు శ్రీవల్లి తల్లి ఎవరన్న విషయం మన దగ్గర వీళ్లు ఎందుకు దాస్తున్నారని...ఎందుకు  యువరాజు శ్రీవల్లిని అంత అసహ్యించుకుంటున్నాడో  అర్థం కావడం లేదని కేదార్‌తో అంటుంది. అత్తయ్యగారికి ఎలా ఉందని అడగ్గా...మనల్ని అటువైపు రావొద్దని వాళ్లే చూసుకుంటానని చెప్పారని కేదార్ అంటాడు.ఆ నిషికకు తనను తానే చూసుకోవడం రాదని..ఇక అత్తయ్యను ఏం చూస్తుందని ధాత్రి వెళ్తుంది. అప్పటికే మంచినీళ్ల కోసం వైజయంతి అల్లాడిపోతుంటుంది. నిషికను ఎన్నిసార్లు పిలిచినా చెవిలో ఇయర్‌బడ్స్ పెట్టుకుని పాటలు వింటూ పలకదు.కొడుకు యువరాజును కేకవేసినా రాడు. 
 
దీంతో వైజయంతి అతికష్టం మీద వాటర్‌ బాటిల్ అందుకోవడానికి ప్రయత్నించి మంచం మీద నుంచి కిందపడబోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధాత్రి ఆమెను పట్టుకుని పైకి లేపుతుంది. నిషిక మీద గట్టిగా కోప్పడుతుంది.  అత్తయ్యగారు మంచినీళ్ల కోసం పిలుస్తుంటే ఏం చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఇదేనా జాగ్రత్తగా చూసుకోవడం అంటే అని అంటుంది. టిఫిన్ పెట్టావా అంటే లేదని అనగా...ధాత్రి మరింత మండిపడుతుంది. 
 
అక్కడికి వచ్చిన సుధాకర్‌ నిషికపై మండిపడతాడు. ఇప్పటి వరకు  టిఫిన్ పెట్టకుండా ఏం చేస్తున్నావని నిలదీస్తాడు.ఇంతలో జగధాత్రి వెళ్లి టిఫిన్ తీసుకుని వచ్చి వైజయంతికి తినిపిస్తుండగా...ఆమె వాంతులు చేసుకుంటుంది.అప్పుడు అక్కడ ఉన్న శ్రీవల్లి దోసిటపడుతుంది.ఇది చూసిన నిషిక, యువరాజు అక్కడ ఉండలేక వెళ్లిపోతారు. దీంతో వైజయంతి చాలా బాధపడుతుంది. నా కడుపున పుట్టినవాళ్లే ఇక్కడి నుంచి వెళ్లిపోయినా..నేను తిట్టిన వాళ్లు మాత్రం నాకు సేవలు చేస్తున్నారని బాధపడుతుంది.