Jagadhatri Serial Today Episode: శ్రీవల్లికి ఏం హక్కు ఉందని ఈ ఇంట్లో ఉంటుందని యువరాజు ప్రశ్నిస్తాడు.అసలు తన వల్లే ఈ ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతున్నాయని మండిపడతాడు.మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపొమ్మని హెచ్చరిస్తాడు. ఉన్నట్టుండి ఆడపిల్లను ఇంట్లో నుంచి బయటకు వెళ్లమంటే ఎలా వెళ్తుందని కేదార్ అంటాడు. ఎక్కడికి వెళ్లాలో మాకు అనవసరమని..అడ్డమైనవాళ్లను ఇంట్లో ఉంచుకోవడానికి వీళ్లేదని యువరాజు అంటాడు. అసలు శ్రీవల్లికి ఈ ఇంట్లో ఉండే హక్కులేదని అంటాడు.
అప్పుడు జగధాత్రి కలుగజేసుకుని శ్రీవల్లి అత్తయ్య కూతురని అందుకే ఇంట్లో ఇంటుందని అంటుంది. దీంతో నిషికకు కోపం వస్తుంది. శ్రీవల్లి అత్తయ్య కూతురని ఎలాంటి రుజువు లేదని అంటుంది. ఒకవేళ శ్రీవల్లి అత్తయ్య కూతురేనని నిరూపిస్తే ఉండొచ్చని అంటుంది. దీంతో జగధాత్రికి ఏం చేయాలో అర్థం కాదు. యువరాజు శ్రీవల్లిని మెడపట్టి బయటకు గెంటడానికి ప్రయత్నిస్తాడు. దీంతో సుధాకర్కు కోపం వచ్చి యువరాజుమీద గట్టిగా అరుస్తాడు.
శ్రీవల్లిని తాను దత్తత తీసుకుంటానని అంటాడు. అప్పుడు ఆమెకు అన్ని హక్కులు వస్తాయని...ఇక ఈ ఇంట్లో ఆమెను ప్రశ్నించే వాళ్లే ఉండరని అంటాడు. ఆ మాటలు విన్న యువరాజు, నిషిక షాక్ తింటారు. వైజయంతి పెద్ద గొడవ చేస్తుంది.నీకు మతి పోయిందా బావ ఇలాంటి పని చేస్తున్నావని అనగా....కౌషికి కలుగజేసుకుని బాబాయి మంచి పనిచేస్తున్నారని అంటుంది.రేపే శ్రీవల్లి దత్తత కార్యక్రమం పెట్టుకుందామని అంటుంది. దీంతో కోపంతో యువరాజు వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
రేపటితో శ్రీవల్లి కష్టాలన్నీ తీరిపోతాయని....ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పారని కేదార్ చెబుతున్నా వినకుండా జగధాత్రి ఆలోచిస్తుంటుంది. కేదార్ ఏమైందని అడగ్గా....శ్రీవల్లి ఇంట్లో ఉండానికే ఒప్పుకుని నిషిక, వైజయంతి అత్తయ్య ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం సక్రమంగా సాగనిస్తారంటావా అని అంటుంది. ఖచ్చితంగా వాళ్లు ఏదో కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని అంటుంది. ఇంతలో గదిలోకి వెళ్లిన యువరాజు కోపంతో రగిలిపోతుంటాడు.
అతన్ని సముదాయించేందుకు నిషిక,వైజయంతి ప్రయత్నిస్తుంటారు.ఇక ఊపేక్షించి లాభం లేదని...ఆ శ్రీవల్లిని చంపేస్తాగానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదని అంటాడు. ఆ మాటలు విన్న నిషిక అదిరిపడుతుంది. ఆస్తి కోసం ఇప్పుడు మర్డర్ చేసి జైలుకు వెళ్లాలా అని అంటుంది. ఇలాంటి పిచ్చి పనులు వద్దని వైజయంతి కూడా హెచ్చరిస్తుంది. మన చేతికి మట్టి అంటకుండా శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపేసే ముఠా ఉందని వాళ్లకు ఈ విషయం చెబుతానని అంటాడు. మనం ఇలాగే చూస్తుంటే రేపు దత్తత కార్యక్రమం కూడా అయిపోతుందని అంటాడు. దీంతో నిషిక,వైజయంతి కూడా ఒప్పుకుంటారు. ఏదో విధంగా శ్రీవల్లిని బయటకు తీసుకొస్తే సరిపోతుందని...ఆ తర్వాత పని వాళ్లే చూసుకుంటారని అంటాడు. ఈ మాటలన్నీ కేదార్, జగధాత్రి వింటారు. వీళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంటారు.
అర్థరాత్రి మారువేషాల్లో నిషిక,వైజయంతి శ్రీవల్లిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా....కేదార్, ధాత్రి వాళ్ల ప్రయత్నాలన్ని బెడిసికొట్టేలా చేస్తారు. నిషిక,వైజయంతి మెట్లపై నుంచి కిందపడి నుడుము విరగ్గొట్టుకుంటారు. చేతులకు రాసుకున్న నూనెతో పైకి లేవలేక పదేపదే కిందపడి మరిన్ని దెబ్బలు తగిలించుకుంటారు.తలుపుచాటున దాక్కున్న వైజయంతిని కావాలనే కేదార్, జగధాత్రి తలుపు గట్టిగా తీసి దెబ్బలు తగిలేలా చేస్తారు.
దీంతో వైజయంతి బతుకుజీవుడా అనుకుంటూ తన గదిలోకి పారిపోతుంది. నిషిక కూడా ఈ ప్రయత్నాలు ఇక వద్దని వారించడంతో యువరాజు రౌడీలను వెళ్లిపొమ్మని చెప్పి వస్తానంటూ బయటకు వస్తాడు. వాళ్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో చిరాకు పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జగధాత్రి...నువ్వుపెట్టిన రౌడీల పని కేదార్ చూసుకుంటున్నాడని చెప్పడంతో యువరాజు అదిరిపడతాడు.
