Jagadhatri Serial Today Episode: మీనన్ ఇంట్లో డబ్బు, బంగారం దోచేసుకుని పారిపోవడానికి డ్రాగన్ వేసిన ప్లాన్ జేడీకి తెలిసిపోతుంది. ఇంటినిండా సీసీ కెమెరాలు పెట్టిన సంగతి తెలియక డ్రాగన్...బీరువా ఓపెన్ చేస్తుంది.అంతే ఒక్కసారిగా అలారం గట్టిగా మోగడంతో భయపడి వెనక్కి తగ్గుతుంది.ఇదంతా మొబైల్‌లో చూస్తున్న జేడీ డ్రాగన్‌కు ఫోన్ చేసి బెదిరిస్తుంది. అక్కడ చీమ చిటుక్కుమన్నా మాకు తెలిసిపోతుందని...నువ్వు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే మళ్లీ జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది.  దీంతో భయపడిపోయిన డ్రాగన్....మళ్లీ ఇలాంటి పనిచేయనని చెప్పి సారీ చెబుతుంది. కానీ వెంటనే బీరువాలో ఉన్న నగలు బ్యాగ్‌ తీసుకుని పారిపోవడానికి మరోసారి ప్రయత్నించగా...ఈసారి ఏకంగా బ్యాగ్‌కు కరెంట్‌ షాక్‌ పెట్టడంతో  ఎగిరి అంతదూరంలో పడుతుంది. దీంతో భయపడిపోయిన డ్రాగన్ ఈ ఇంట్లో ఇక ఏం ముట్టుకుంటే ఏం జరుగుతుందోనని బిత్తరపోతుంది. ఇదంతా వీడియోలో చూస్తున్న జేడీ, కేడీ ఇద్దరూ...ఇక డ్రాగన్ పిచ్చిపిచ్చి పనులేవీ చేయదనుకుని ఇంటికి బయలుదేరతారు.               కౌషికి దగ్గర నుంచి 50శాతం షేర్లు రాయించుకున్న నిషిక, యువరాజు వాటిని కౌషికి తెలియకుండా అమ్మకానికి పెడతారు. షేర్లుకొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి గంటల తరబడి ఆ పేపర్లు చూస్తూ ఉండిపోతాడు. ఏమైందని అడిగితే... ఇది కల నిజమో తెలియడం లేదని అంటాడు. వజ్రపాటి గ్రూప్‌లో 10శాతం షేర్లు కొనడానికి పదేళ్లుగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని..అలాంటిది నా చేతిలో 50శాతం షేర్లు ఉన్నాయంటే  నమ్మలేకపోతున్నానని అంటాడు. మీరు ఎంత చెబితే అందుకు 10కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకుంటానని అంటాడు. ఆమాటలు విన్న వైజయంతి, నిషిక, యువరాజు కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.అప్పుడే వాళ్లకు టీ ఇవ్వడానికి శ్రీవల్లి అక్కడికి వస్తుంది. షేర్లు అమ్మడానికి సంబంధించిన వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలన్నీ వింటుంది. దీంతో వైజయంతికి కోపం వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ ఆమెను తిట్టి బయటకు తీసుకెళ్తుంది. ఏం చేస్తున్నారు అమ్మ అని అడగ్గా...అవన్నీ నీకు ఎందుకని వైజయంతి అంటుంది. అక్క ఎంతో కష్టపడి ఈ కంపెనీని నిలబెడితే...మీరు ఆమెకు తెలియకుండా షేర్లు అమ్మడం తప్పని అంటుంది. ఆమాటలు విన్న వైజయంతి కోపంతో రగిలిపోతుంది. మాకే నీతులు చెప్పేదానివి అయిపోయావా అంటూ ఆమె చెంప పగులగొడుతుంది.                   జగధాత్రి, కేదార్ ఇంటికి రాగానే ఏడుస్తున్న శ్రీవల్లిని ఏమైందని నిలదీస్తారు. ఏం లేదని శ్రీవల్లి అబద్ధం చెబుతుంది.ఇంతలో కౌషికి వచ్చి ఆ చెంపపై దెబ్బ ఏంటని అడుగుతుంది.ఎవరు కొట్టారని ప్రశ్నించినా శ్రీవల్లి చెప్పదు. జగధాత్రి చెంపదెబ్బ చూసి వైజయంతి అత్తయ్య పనేనని అంటుంది. దీంతో నిషిక పిన్నిని గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి వైజయంతి బయటకు వస్తుంది.ఆమెతోపాటు నిషిక,యువరాజు కూడా వస్తారు. ఎందుకు శ్రీవల్లిని కొట్టారని గట్టిగా నిలదీయగా....అదేదో తప్పుడు పని చేసి ఉంటుందని అందుకే అత్తయ్య కొట్టారని నిషిక అంటుంది. సుధాకర్ గట్టిగా అడగ్గా....కౌషికి వదిన రాసిచ్చిన షేర్లు వీళ్లు ఎవరికో అమ్ముతున్నారని అది తప్పని చెప్పినందుకు కొట్టిందని చెప్పేస్తుంది. శ్రీవల్లి అబద్ధాలు చెబుతోందని...అలాంటిదేమీ చేయడం లేదని నిషిక,యువరాజు చెబుతారు. దీంతో కౌషికి కేదార్‌ను వెళ్లి చూసి రమ్మనగా....నిషిక రూమ్‌లో ఉన్న పెద్దమనిషిని తీసుకుని కేదార్ బయటకు వస్తాడు. ఇప్పుడు తప్పు చేసింది ఎవరో చెప్పండని జగధాత్రి నిలదీస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి తాను మళ్లీ కలుస్తానంటూ వెళ్లిపోతాడు. దీంతో నిషిక మాట మారుస్తుంది. మేం షేర్లు అమ్మాలని అనుకోలేదని...అతనితో బిజినెస్‌ మాట్లాడటానికి పిలిచామని...కానీ మీరే యువరాజు పరువు తీశారని నిషిక అంటుంది. ఈ శ్రీవల్లి లేనిపోనివి ఊహించుకుని మీకు చెప్పిందని అంటుంది. దీంతో కోపంతో ఊగిపోయిన యువరాజు...శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపొమ్మని ఆదేశిస్తాడు.