బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసినఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి ఇందులో కీలకపాత్రల్లో నటించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  


సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాపై మొదటినుంచి కూడా గంగూబాయి ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదలవుతుండగా.. గంగూబాయి దత్తపుత్రుడు బాబు రావుజీషా, గంగూబాయి మనవరాలు భారతి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'నా తల్లిని వేశ్యగా చూపిస్తారా..? జనాలు ఇప్పుడు మా అమ్మ గురించి చెప్పుకోలేని మాటలు మాట్లాడుతున్నారు' అంటూ బాబు రావుజీషా ఆవేదన వ్యక్తం చేశారు. 


డబ్బు కోసం తమ కుటుంబ పరువు తీశారని గంగూబాయి మనవరాలు భారతి చిత్ర దర్శకనిర్మాతలపై మండిపడింది. ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి తమ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోలేదని.. పుస్తకం రాసేప్పుడు కూడా తమ వద్దకు రాలేదని.. సినిమా తీయడానికి ముందు కూడా అనుమతి తీసుకోలేదని ఫైర్ అయింది. తన అమ్మమ్మ జీవితాంతం సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేసిందని.. అలాంటిది ఈ వ్యక్తులు మా అమ్మమ్మను ఎలా చూపిస్తున్నారు..? అంటూ భారతి ప్రశ్నించింది. 


గతేడాది ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాబూజీ రాజీ షా స్థానిక కోర్టుకు వెళ్లారు. దీంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్ లకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ విషయంలో అలియా, సంజయ్ ల తరఫు లాయర్ హైకోర్టుని సంప్రదించగా.. సినిమా విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది.