టాలీవుడ్ ఇండస్ట్రీని కొంతకాలంగా వేధిస్తున్న ఏపీ టికెట్ రేట్ల వ్యవహారం ఇప్పుడో కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ అలానే రాజమౌళి ఇలా చాలా మంది ప్రముఖులు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. సినీ ప్రముఖులకు జగన్ నుంచి కచ్చితమైన హామీలు వచ్చినట్లు సమాచారం. అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని.. జీవోను విడుదల చేస్తామని చిరంజీవి అండ్ టీమ్ కి జగన్ హామీ ఇచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. 

 

ఈ క్రమంలో కొందరు టాలీవుడ్ సభ్యులు, నెటిజన్లు మంచు ఫ్యామిలీను టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సినిమా టికెట్ రేట్ల విషయంలో మొత్తం ఇండస్ట్రీ ఒక మాటపై ఉండాలని చెప్పిన మోహన్ బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. చిరంజీవితో పాటు అమరావతికి వెళ్లడానికి మంచు ఫ్యామిలీకి వచ్చిన కష్టమేంటో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

 

పోనీ చిరంజీవి కంటే ముందు మోహన్ బాబు ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఉండాల్సిందని అప్పుడు కచ్చితంగా ఆయనే సినీ పెద్ద అయ్యేవాడంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేస్తూ.. అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నామధ్య చిరంజీవి.. జగన్ ను కలిస్తే అది ఆయన వ్యక్తిగత విషయమని.. ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఎలా అవుతుందని కామెంట్స్ చేశారు విష్ణు. ఇప్పుడు చిరు ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ వెళ్లడంతో.. అది కూడా వ్యక్తిగత విషయమేనా విష్ణు గారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

 

కాసేపటి క్రితం మంచు విష్ణు పెట్టిన ట్వీట్ తో అతడిని మరింత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని తమ ఇంటికి వచ్చినట్లుగా విష్ణు ఓ ఫొటోను షేర్ చేసి.. టికెట్ రేట్ల విషయంలో ముందడుగు వేసినందుకు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్లాన్స్ చేస్తుందో తమకు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ ట్వీట్ కింద మంచు విష్ణుని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు. దెబ్బకి ట్వీట్ డిలీట్ చేసేసి సింపుల్ గా పేర్ని నానికి థాంక్స్ చెప్పి ఊరుకున్నారు.