బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కారు ప్రమాదానికి గురైంది. గుడికి వెళ్లి వస్తుండగా తన కారు యాక్సిడెంట్ కు గురైనట్టు, కాలుకి తీవ్ర గాయాలైనట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.ముంబైలోని జై శ్రీ మహాకాల్ ఆలయానికి వెళ్లే దారిలో ఈ ఘటన జరిగినట్టు చెబుతోంది తనుశ్రీ. కారు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఇలా జరిగనట్టు ఆమె తెలిపింది.


 ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుల ద్వారా ఆమె ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకుంది. అందులో ‘నా నమ్మకం, విశ్వాసం గుడ్డివి కావు. నేను ఊబిలో కూరుకుపోతున్నప్పుడు నా నమ్మకమే నాకు తాడులా మారుతుంది. ఇలాంటి కష్ట సమయాల్లో నమ్మకం, విశ్వాసమే నాకు కవచం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియన ఇలాంటి క్షణంలో కూడా ఒక చిన్న స్వరం నాకు వినిపించింది, ఆ స్వరం అంతా మంచే జరుగుతుంది అని చెప్పింది. ఆ సమయంలో నా ఎముకలు విరగకూడదు అని ప్రార్థించాను. దేవుని దయ వల్ల ఎముకలు విరగలేదు. నేను నమ్మకంతో, విశ్వాసంతో జీవించాలని అనుకున్నాను. ఏది జరిగిన నా మంచికే అనుకుంటాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. రేపు కచ్చితంగా మంచి రోజు అవుతుంది.’ అని రాసుకొచ్చింది. 


కొవ్వు పట్టడం వల్లే...
ఆమె మరో పోస్టులో ‘ఆదివారం, సోమవారాల్లో చెడు ఏమీ జరగదని నేను నమ్ముతాను. జరిగినా కూడా అది నా మంచికే అని నమ్ముతాను. నా కాలులోని కొవ్వు పొరలు ఉండడం నాకే మంచే జరిగింది. వాటి వల్ల నా ఎముకలు విరగలేదు, ఒక్కోసారి లావుగా ఉండడం కూడా మేలు చేస్తుంది. క్యూట్ గా కనిపించడమే కాదు, ఇలా కూడా కొవ్వు కాపాడుతుంది’ అని చెప్పింది తనుశ్రీ. 


తనుశ్రీ దత్తా తెలుగులో హీరో బాలయ్యతో ‘వీరభద్ర’ సినిమాలో నటించింది. ఆ తరువాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. అక్కడ కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు. 2018లో మీటూ ఉద్యమంతో వార్తల్లోకి వచ్చింది. ఎంతో మంది ప్రముఖుల పేర్లను మీటూ ఉద్యమంలో ఆమె బయటపెట్టింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే వార్తల్లోకి వచ్చింది.