ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రధాని మోదీ కూడా ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని అభినందించారు. 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు.


ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమాకి క్రిటిక్స్ మంచి రివ్యూస్ ఇస్తున్నారు. అలానే ఈ సినిమాను తిట్టేవాళ్లు కూడా ఉన్నారు. వన్ సైడెడ్ స్టోరీగా సినిమా ఉందని.. చాలా మంది దర్శకుడు వివేక్ ను విమర్శిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియా వేదికగా వివేక్ ని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అతడికి సెక్యూరిటీ ఇవ్వాలని నిర్ణయించుకుందట. 


యూనియన్ మినిస్ట్రీ.. వివేక్ అగ్నిహోత్రికి 'Y' కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని భావిస్తోందట. మొత్తం ఎనిమిది మంది పోలీసులు వివేక్ చుట్టూనే ఉంటారట. గతంలో వివాదాస్పద నటి కంగనాకు కూడా ఇలానే 'Y' సెక్యూరిటీ కేటాయించారు. ఇప్పుడు వివేక్ కి కూడా సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు. 


ఇక 'ది కశ్మీర్ ఫైల్స్   సినిమా కథ గురించి చెప్పాలంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.